
ఇండస్ట్రీయల్ డెవెలప్మెంట్ బ్యాంకు (ఐడీబీఐ).. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఓ’, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1300 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఓ’ 1100 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ పోస్టులు 200 వరకు ఉన్నాయి. హైదరాబాద్ జోన్లో 65 వరకు ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కొచ్చి, లఖ్నవూ, ముంబయి, నాగ్పుర్, పుణె, పట్నా బ్రాంచుల్లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది.
గ్రేడ్ ‘ఒ’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లేదా షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ లేదా కోఆపరేటివ్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంకులలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు మార్చి 1, 2026 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో మార్చి 19, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1050, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. జేఏఎం ఆన్లైన్ రాత పరీక్ష ఏప్రిల్ 12 ఉదయం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ రాత పరీక్ష ఏప్రిల్ 12 మధ్యాహ్నం నిర్వహిస్తారు.
లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెటేషన్ విభాగంలో 60 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 40 ప్రశ్నలు, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/ కంప్యూటర్/ ఐటీ విభాగంలో 60 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. గ్రేడ్ ఒ స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 60 అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.