
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) 2026-27 విద్యా సంవత్సరం నుండి కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది. ఇకపై మొదటి ఏడాదిలో 15 మార్కులు, రెండో ఏడాదిలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అలాగే గణితం, హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులలో కొత్తగా ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ABL) ద్వారా అంతర్గత మూల్యాంకన (Internal Assessment) పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణల నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను కూడా సమూలంగా మార్చింది. మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సవరించిన సిలబస్తో కూడిన పుస్తకాలను నిపుణుల కమిటీ పర్యవేక్షణలో రూపొందించారు. ఈ కొత్త పుస్తకాల్లో డయాగ్రామ్స్, నాలెడ్జ్ బాక్స్లు, క్యూఆర్ కోడ్లు, భారతీయ జ్ఞాన వ్యవస్థలకు (Indian Knowledge Systems) సంబంధించిన సమాచారాన్ని చేర్చారు. విద్యార్థులకు చదువు సులభతరం చేసేలా సిమ్యులేషన్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాల పంపిణీని జూన్ 1వ తేదీ లోపు పూర్తి చేస్తామని బోర్డు స్పష్టం చేసింది.
మరోవైపు, రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మే 12 నుండి ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ‘ACE’ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) పేరుతో సరికొత్త గ్రూపును బోర్డు పరిచయం చేసింది. అలాగే ఎంఈసీ (MEC) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గణిత ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నట్లు బోర్డు వెల్లడించింది. గత ఏడాది కంటే ముందుగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తూ, విద్యార్థుల అభ్యున్నతికి తాము కట్టుబడి ఉన్నామని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.