
ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2026 ఫలితాలు శుక్రవారం (మే 8న) విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) ఆధ్వర్యంలో జేఎన్టీయూ అనంతపురం ఈ పరీక్షను గత నెల ఏప్రిల్ 23న విజయవంతంగా నిర్వహించింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈసారి మొత్తం 33,751 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 32,434 మంది (96.09%) హాజరయ్యారు. వీరిలో 29,750 మంది ఉత్తీర్ణత సాధించారు.
గత ఏడాదితో పోలిస్తే హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గినప్పటికీ, విద్యార్థులు మంచి ప్రతిభను చూపారని అధికారులు తెలిపారు. బాలుర వివరాలు చూస్తే, 21,704 మంది పరీక్ష రాయగా 19,735 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విషయానికి వస్తే, 10,730 మంది హాజరుకాగా 10,015 మంది విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రం వెలుపల ఉన్న హైదరాబాద్ పరీక్షా కేంద్రం అత్యధికంగా 97.17% ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్రంలోని జిల్లాల్లో కృష్ణా (95.43%), విశాఖపట్నం (93.30%), ఎన్టీఆర్ (92.10%) జిల్లాలు మంచి ఫలితాలతో ముందంజలో నిలిచాయి.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి తమ మార్కులు, ర్యాంక్ చూసుకోవడంతోపాటు ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న జరిగిన ఈసెట్ పరీక్షలకు 32,434 మంది హాజరుకాగా, 29,750 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.