
అమరావతి, మార్చి 15: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (మార్చి 16) నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ప్రారంభం కానున్నాయి. ప్రధాన పరీక్షలన్నీ మార్చి 30వ తేదీ వరకు జరగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకోవడానికి వీలుగా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ ను మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో, ఎంత టైమ్ పడుతుందో డిస్ ప్లే అవుతాయి. అలాగే విద్యార్ధులు తమ హాల్ టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉంటుంది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించి ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు.
ఇక ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్ధులకు ఆయా తేదీల్లో ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుంది. విద్యార్ధులు మాత్రం ఎగ్జామ్ సెంటర్లలోకి ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈసారి పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేసింది. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులను గరిష్ఠంగా అరగంట వరకు అనుమతిస్తారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తామని అధికారులు తెలిపారు. చివరి నిమిషంలో గందరగోళానికి గురికాకుండా అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 4వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. నెలాఖరుకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.