
అమరావతి, మార్చి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరుగుతున్నాయి. 210 సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య సెలవులు వచ్చేలా ఈ సారి టైం టేబుల్ రూపొందించారు. దీంతో విద్యార్ధులు ఒత్తిడిలేకుండా పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక సోమవారం జరిగిన పరీక్షకు 98.90 వాతం మంది పరీక్షలకు హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మొత్తం 6,29,109 మంది విద్యార్థులకు గాను 6,22,217 మంది పరీక్ష రాశారని వెల్లడించారు.
ఇక పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 4వ తేదీ నుంచే పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా తయారు చేసింది. షెడ్యూల్ ప్రకారం టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 26 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి క్యాంపు అధికారులుగా ఆయా జిల్లాల విద్యాధికారులు ఉంటారు.
ఇక మూల్యాంకనం చేయనున్న ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు రోజుకు కేవలం 40 చొప్పున మాత్రమే జవాబుపత్రాలు మూల్యాంకనం చేసేందుకు ఇస్తారు. అనంతరం మార్కుల లెక్కింపులో తప్పులు జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ట్యాబ్లలో వాటిని నమోదు చేసే విధానం తీసుకొస్తున్నారు. మొత్తం 10 రోజుల పాటు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం మార్కుల నమోదు ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ నెల చివరి వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.