
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఏపీ పీజీసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైంది. మే 5వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2025 (ఏపీ పీజీసెట్) రాసే విద్యార్ధులు సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది పరీక్ష రాస్తున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ కేటగిరీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఏపీ పీజీసెట్ 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్ష కంప్యూటర్ ఆధారిత(సీబీటీ) ఆన్లైన్ విధానంలో ఉంటుంది. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయిస్తారు. పీజీసెట్ రాత పరీక్షను మూడు కేటగిరీలుగా నిర్వహిస్తారు. ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్.. కేటగిరీ 1లో, కామర్స్ అండ్ ఎడ్యుకేషన్.. కేటగిరీ 2లో, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష కేటగిరీ 3 కింద నిర్వహిస్తారు.
ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.