
అమరావతి, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మార్చి 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లతోపాటు 7 నుంచి పదో తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఏప్రిల్ 17 వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుంది. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, రిజర్వేషన్ ఇతర సర్టిఫికెట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన వారికి ఉచిత విద్యా, భోజన, అవాస, నివాస సౌకర్యం కల్పిస్తారు.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పేపర్ 1 పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా పేపర్ 2కి ఎంపికైన వారి వివరాలు తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 3, 4, 5, 6, 13 తేదీల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 2కు సివిల్ ఇంజినీరింగ్లో 11,593 మంది, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్లో 4,014 మంది అభ్యర్థులు సెలక్ట్ అయినట్లు కమిషన్ వెల్లడించింది. కాగా ఈ నోటిఫికన్ కింద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ శాఖల్లో గ్రూప్ బి (నాన్-గేజిటెడ్, నాన్-మినిస్టీరియల్) స్థాయిలో 1340 జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
ఎస్సెస్సీ జూనియర్ ఇంజినీర్ పేపర్ 1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.