
సొంతిల్లు అనేది ఎంతోమంది కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. 15 నుంచి 30 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో ఈ రుణాలు ఉంటాయి. అయి, లోన్ వ్యవధి తీరకుండానే రుణం తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. మిగిలిన రుణాన్ని ఎవరు చెల్లించాలి? బ్యాంకులు ఆ ఇంటిని వేలం వేస్తాయా? లేక బకాయిలు రద్దవుతాయా? ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయో అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
హోమ్ లోన్ ఇచ్చే సమయంలోనే బ్యాంకులు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ప్లాన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తాయి. రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా కంపెనీయే మిగిలిన లోన్ మొత్తాన్ని బ్యాంకుకు చెల్లిస్తుంది. దీనివల్ల మృతుడి కుటుంబంపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. లోన్ క్లియర్ అయిన తర్వాత ఆస్తి హక్కులు వారసులకు బదిలీ అవుతాయి.
భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కలిపి జాయింట్ లోన్ తీసుకున్న సందర్భంలో దరఖాస్తుదారు మరణిస్తే, లోన్ చెల్లించే బాధ్యత కో అప్లికెంట్కు ఉంటుంది. మిగిలిన ఈఎమ్ఐలను రెండవ వ్యక్తి నిరంతరం చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లేకపోతే, సదరు వ్యక్తి చట్టబద్ధ వారసులు లేదా కుటుంబ సభ్యుల వద్దకు బ్యాంక్ అధికారులు వెళ్తారు. వారసులు మిగిలిన లోన్ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడితే, వారి పేరిట లోన్ రీ-షెడ్యూల్ లేదా ట్రాన్స్ఫర్ చేసి ఈఎమ్ఐలు కట్టించుకుంటారు. వారసులు లోన్ చెల్లించలేమని చెబితే, లేదా చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
వారసులు ఈఎమ్ఐలు చెల్లించకపోతే.. బ్యాంక్ సదరు ఆస్తిని సీజ్ చేసి సర్ఫేసీ యాక్ట్ కింద బహిరంగ వేలం వేస్తుంది. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో బ్యాంక్ తన బకాయిలను జమ చేసుకుంటుంది. లోన్ బకాయిలు పోనూ ఇంకా ఏమైనా డబ్బు మిగిలితే, ఆ మొత్తాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తుంది.
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం. ఇది ఏదైనా జరిగినప్పుడు కుటుంబానికి నివాస ఆసరాను అందించి, ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.