వాట్సాప్‌లో కొత్త సైబర్‌ స్కామ్‌! మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులే వారి టార్గెట్‌!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని 8వ వేతన సంఘం పేరుతో కొత్త వాట్సాప్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. జీతాల పెంపు వివరాలు అందిస్తామంటూ మోసగాళ్లు అనుమానాస్పద లింక్‌లు, APK ఫైల్‌లను పంపుతున్నారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే మాల్వేర్ ద్వారా బాధితుల మొబైల్ ఫోన్‌పై రిమోట్ యాక్సెస్ పొంది, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

వాట్సాప్‌లో కొత్త సైబర్‌ స్కామ్‌! మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులే వారి టార్గెట్‌!
Whatsapp Strict Account Set

Updated on: Feb 19, 2026 | 6:30 AM

ఇప్పుడు దాదాపు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్‌ వాడుతున్నారు. వాట్సాప్‌ మన లైఫ్‌స్టైల్‌లో ఒక భాగం అయిపోయింది. ప్రతి మనిషికి ఆధార్‌ కార్డ్‌ నంబర్‌, పాన్‌ కార్డ్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌లా.. వాట్సాప్‌ నంబర్‌ కూడా మ్యాన్‌డేటరీ అయిపోయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మరో కొత్త సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రాబోయే 8వ వేతన సంఘం పేరిట జీతాల పెంపు వివరాలు త్వరగా అందిస్తామని నమ్మించి, ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల పలువురు కేంద్ర ఉద్యోగులకు 8వ వేతన సంఘానికి సంబంధించిన అనుమానాస్పద వాట్సాప్ సందేశాలు రావడంతో, ప్రభుత్వం బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. మోసగాళ్లు ఉద్యోగి సవరించిన జీతాన్ని లెక్కిస్తామని చెబుతూ లింక్‌లను పంపుతున్నారు. ఈ సందేశాల్లో ఉన్న లింక్‌పై క్లిక్ చేయగానే వినియోగదారులను APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని కోరుతున్నారు. మొదట ఇది సాధారణ జీతం కాలిక్యులేటర్ యాప్‌లా కనిపించినప్పటికీ, వాస్తవానికి ఇది హానికరమైన మాల్వేర్ అని అధికారులు చెబుతున్నారు. ఈ APK ఫైల్‌ను ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మోసగాళ్లు బాధితుడి మొబైల్ ఫోన్‌పై రిమోట్ యాక్సెస్ పొందుతారు. దాంతో ఫోన్‌లోని సున్నితమైన సమాచారం, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించి, అనధికార లావాదేవీలు చేయగలుగుతారు.

8వ వేతన సంఘం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించినది కావడంతో, దీనిపై ఉన్న ఆసక్తిని మోసగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారు. ఒకసారి ఫోన్ హ్యాక్ అయిన తర్వాత, బాధితులు అది గుర్తించేలోపే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయమయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కీలక సూచనలు

ప్రభుత్వం ఎప్పుడూ వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా APK ఫైల్‌లు పంపదని అధికారులు స్పష్టం చేశారు. తెలియని లింక్‌లు, యాప్‌లు, ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయరాదని, జీతం లేదా పెన్షన్‌కు సంబంధించిన సమాచారానికి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. 8వ వేతన సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వేతనాలు, భత్యాలు, సేవా నిబంధనలపై సూచనలు, అభిప్రాయాలను ఈ వెబ్‌సైట్ ద్వారా స్వీకరిస్తోంది. తాజా సమాచారం కోసం అధికారిక వేదికలను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us