
ప్రస్తుతం కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. చాలా మంది తమ డబ్బు కొన్ని నెలల్లోనే భారీగా పెరిగిపోతుందని నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి పెట్టడం ముఖ్యం కాదని దాన్ని ఎలా పెట్టాలి, పెట్టే ముందు ఎలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలో ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, అపర కుబేరుడు వారెన్ బఫెట్ తెలిపారు. మరి కొత్త పెట్టుబడిదారులకు ఆయన ఇచ్చిన సూచన ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పెట్టుబడి పెట్టేవారు తమ నైపుణ్యాలను గుర్తు పెట్టుకోవాలని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందు తొలుత మన నైపుణ్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి. స్వీయ అవగాహన, వాస్తవికతతో వ్యవహరించాలి. అర్థం చేసుకున్నదానిపై స్పష్టత ఉండాలి. దాంతో పాటు తెలియని దాని గురించి తెలుసుకోవాలి. ఆ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని తెలిపారు. డబ్బు వేగంగా పెరగాలనే దురాశ పనికిరాదని అన్నారు. అదుపులేని ఆ ప్రవర్తన దీర్ఘకాలిక రాబడులకు ప్రధాన శత్రువు అవుతుందని, వెనువెంటనే లాభాలు రావాలని ఆరాటపడేవారిలో హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.
సొంత ఆలోచన ఉండాలని స్పష్టం చేశారు. పెట్టుబడి పెట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ కాదు. అయితే దానికి క్షమశిక్షణ అవసరం. సమాజంలో ప్రబలంగా వినిపించే అభిప్రాయాల ఊబిలో పడకుండా మనకంటూ సొంత అలోచన ఉండాలని అన్నారు. ఇక తన పెట్టుబడి వ్యూహాల వెనక బెంజమిన్ గ్రాహమ్ ప్రభావం ఉందని వారెన్ బఫెట్ ఓ సీక్రెట్ను రివీల్ చేశారు. దశాబ్దాలుగా మార్కెట్ ఎన్నో మార్పులకు లోనైన తర్వాత కూడా గ్రాహమ్ పాఠాలు తిరుగులేనివని చెప్పారు. స్టాక్స్ను ఒక వ్యాపారంగా భావించి, ఏది రాణిస్తుందో గుర్తించాలని తెలిపారు. మరి స్టాక్స్లో లక్షల కోట్లు సంపాదించిన వారెన్ బఫెట్ విలువైన సూచనలను పాటించి మీ డబ్బును పెంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి