
అమెరికా వాణిజ్య విధానంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోపే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన పోస్టులో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ, దశాబ్దాలుగా అమెరికా ప్రయోజనాలను ఇతర దేశాలు దెబ్బతీస్తున్నాయని, ఇప్పుడు చట్టబద్ధ స్థాయిలో సుంకాలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికాను మళ్లీ ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ చర్యల లక్ష్యమని కూడా ఆయన తెలిపారు.
ఇదే సమయంలో శుక్రవారం వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఆధారంగా చేసుకుని గతంలో విధించిన భారీ సుంకాలు అధ్యక్ష అధికారాలను మించినవని కోర్టు 6–3 మెజారిటీతో తేల్చింది. జాతీయ అత్యవసర పరిస్థితిని చూపుతూ విధించిన ఆ టారిఫ్లు చట్టబద్ధం కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పు తర్వాత వెంటనే ట్రంప్ 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను ఉపయోగిస్తూ కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ను ప్రకటించి, అవసరమైతే ఇతర చట్టపరమైన మార్గాలనూ వినియోగిస్తామని హెచ్చరించారు.
ఈ పరిణామాల ప్రభావం భారత్పై కూడా కనిపించే అవకాశం ఉంది. గతంలో అమెరికా భారత్పై విధించిన పరస్పర సుంకాలు పలు దఫాలు మారాయి. తాజాగా రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం తర్వాత వాటిని 18 శాతానికి తగ్గించారు. అయితే ట్రంప్ ప్రకటించిన 15 శాతం ప్రపంచ సుంకం కారణంగా భారత ఎగుమతులపై ప్రభావవంతమైన టారిఫ్ సుమారు 18.5 శాతానికి చేరినట్లు అంచనా. దీంతో అమెరికా వాణిజ్య విధానంలో ఏర్పడిన అనిశ్చితిపై భారత్ సహా అనేక దేశాలు ఇప్పుడు సమీక్ష కొనసాగిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి