Toll Charges: కేవలం రూ.350కే టోల్ పాస్.. ఎన్నిసార్లు అయినా వెళ్లవచ్చు.. వాహనదారులకు మంచి ఛాన్స్..

టోల్ ప్లాజాల వద్ద కొత్త సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిజిటల్ లోకల్ టోల్ పాస్ వ్యవస్థను తీసుకొచ్చింది. టోల్ గేట్లకు సమీపంలో 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు దీనిని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. రూ.350 నుంచి పాస్ ధర ప్రారంభమవుతుంది.

Toll Charges: కేవలం రూ.350కే టోల్ పాస్.. ఎన్నిసార్లు అయినా వెళ్లవచ్చు.. వాహనదారులకు మంచి ఛాన్స్..
Toll Pas

Updated on: Aug 21, 2026 | 12:21 PM

టోల్ గేట్ల సమీపంలో నివసించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇకపై ప్రతీసారి మీరు టోల్ చెల్లించనక్కర్లేదు. ఒక్కసారి పాస్ తీసుకుంటే నెల రోజుల పాటు ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు. రోజువారీ పనులు, ఇతర సాధారణ ప్రయాణాల కోసం టోల్ ప్లాజాల సమీపంలోని ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. చిన్న దూరానికి కూడా ప్రతీసారి టోల్ చార్జీ చెల్లించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు లోకల్ పాస్ వ్యవస్థను నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా(NHAI) తీసుకొచ్చింది. డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు దీనిని వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాస్ ఎలా పొందాలి? ప్రాసెస్ ఎలా? అనేది చూద్దాం.

వాహనం కేటగిరీని బట్టి ధరలు

టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు లోకల్ పాస్ పొందవచ్చు. ఈ పాస్ ధర రూ.350 నుంచి ప్రారంభమవుతుంది. వాహనం కేటగిరీని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. ఈ పాస్ నెల రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. నెల రోజుల పాటు టోల్ ప్లాజా గుండా అపరిమిత ప్రయాణం చేయవచ్చు. ప్రతీసారి మీరు ప్రత్యేకంగా టోల్ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. రోజువారీ పనులు లేదా ఇతర సాధారణ ప్రయాణాల కోసం ఒక టోల్ ప్లాజా గుండా రోజూ వెళ్లే ప్రయాణికులకు ఈ పాస్ వల్ల ఉపయోగం కలగనుంది. అయితే ఈ పాస్ ప్రతీ టోల్ ప్లాజా వద్ద అమలు చేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 121 టోల్ గేట్ల వద్ద అమలు చేస్తున్నారు. దీంతో మీరు తరచూ రాకపోకలు సాగించే టోల్ ప్లాజా వద్ద ఈ వ్యవస్థ అమల్లో ఉందో లేదో తెలుసుకోవాలి.

టోల్ పాస్ ఆన్‌లైన్ ద్వారా ఎలా తీసుకోవాలి..?

కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాజమార్గ యాత్ర యాప్ ద్వారా మీరు ఈ లోకల్ పాస్ పొందవచ్చు. యాప్‌లో జీఐఎస్ ఆధారిత ధృవీకరణ ఫీచర్ ఉంటుంది. మీరు యాప్ ఓపెన్ చేయగానే టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారో.. లేదో గుర్తిస్తుంది. అలాగే ప్రయాణికుడి అడ్రస్, వాహన వివరాలు, ఫాస్టాగ్ వంటి సమాచారాన్ని డిజిలాకర్, వాహన్ వంటి ప్రభుత్వ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ధృవీకరించి మీరు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్నా.. లేదా అనేది గుర్తిస్తుంది. దీని వల్ల మీరు అడ్రస్ ప్రూఫ్ కోసం ఫిజికల్ పత్రాలను విడిగా సమర్పించాల్సిన అవసరం ఉండదు. అడ్రస్, వెహికల్ వివరాలు, ఫాస్టాగ్, టోల్ ప్లాజా స్థానం జీఐఎస్ ధృవీకరిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us