
చాలామంది 35 ఏళ్ల వయసులో SIPలు లేదా పెట్టుబడులు ప్రారంభించినప్పుడు, 22 ఏళ్లలోనే మొదలుపెట్టిన వారితో తమను పోల్చుకుని వెనుకబడ్డామనే భయం కలుగుతుంది. అయితే ఆర్థిక నిపుణులు చెబుతున్నది వేరే 35 ఏళ్లు పెట్టుబడి ప్రయాణానికి ఆలస్యం కాదు. ఇది మరింత స్పష్టతతో ప్రారంభించే మెచ్యురిటీ స్టేజ్. ఈ వయసులో సాధారణంగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది, రిస్క్పై అవగాహన మెరుగ్గా ఉంటుంది, డబ్బు ఎందుకు కూడబెట్టాలనే లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి.
పెట్టుబడులకు ముందు బలమైన పునాది అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం ఆరు నెలల ఖర్చులను కవర్ చేసే ఎమర్జెన్సీ ఫండ్, ఉద్యోగానికి సంబంధం లేకుండా సరైన హెల్త్ ఇన్సూరెన్స్, కుటుంబంపై ఆధారపడేవారు ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవి తప్పనిసరి. ఈ భద్రత లేకుండా మార్కెట్ పడిపోయిన ప్రతిసారీ పెట్టుబడిదారులు భయంతో తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది. 35 ఏళ్ల వయసులో ముఖ్యమైన అంశం ఫండ్ ఎంపిక కంటే పొదుపు రేటు. నెలకు రూ.50,000 క్రమంగా పెట్టుబడి పెట్టేవారు, నెలకు రూ.15,000 మాత్రమే పెట్టి బెస్ట్ ఫండ్ వెంబడించే వారికంటే సాధారణంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరిగేకొద్దీ పొదుపును పెంచడం కీలకం.
ఇక ఈక్విటీని పూర్తిగా దూరం పెట్టడం ఈ దశలో సరైన వ్యూహం కాదని నిపుణులు చెబుతున్నారు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో క్రమశిక్షణతో SIPలు కొనసాగించడం దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి అవసరం. పోర్ట్ఫోలియోను అతిగా క్లిష్టతరం చేయకుండా, SIPలను ఆటోమేట్ చేసి, స్పష్టమైన లక్ష్యాలతో పెట్టుబడి పెడితే 35లో ప్రారంభించినా గట్టి ఆర్థిక భవిష్యత్తు నిర్మించడం పూర్తిగా సాధ్యమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి