
అమెరికా- ఇరాన్ల మధ్య యుద్దం మళ్లీ మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు మళ్లీ దిగుతున్నాయి. గల్ప్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుండగా.. అమెరికా కూడా ఎదురుదాడి చేస్తోంది. యుద్దం మళ్లీ మొదలుకావడంతో అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల యుద్దం ముగియడంతో ధరలు పడిపోగా.. ఇప్పుడ తిరిగి ప్రారంభం కావడంతో ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. యుద్దం ఇలాగే కొనసాగి ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఉద్రిక్తతలు కొనసాగితే దేశంలో ముడి చమురు దిగుమతుల విలువ బ్యారెల్కు 75 డాలర్లను దాటే అవకాశముంటుంది. దీనివల్ల దేశ దిగుమతుల బిల్లు పెరగడం వల్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
ముడిచమురు అమ్మకాలపై ఇరాన్కు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును అమెరికా ఉపసంహరించుకుంది. మళ్లీ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో ముడిచమురు, ఎల్ఎన్జి ట్యాంకర్లపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ముడి చమరు సరఫరా గొలుసుకు అడ్డంకులు ఏర్పడే అవకాశముంది. ఈ భయాందోళనల క్రమంలో ట్రంప్ ప్రకటన దగ్గర నుంచి ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ ముడిచమురు ధరలు దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్కు 78క డాలర్లకు చేరుకున్నాయి. యూఎస్ ముడిచమురు 74 డాలర్లకుపైగా ట్రేడవుతోంది. యుద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశముంటుంది. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెంచక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశముంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భారత ముడి చమురు బాస్కెట్ ధర ప్రస్తుతం బ్యారెల్కు 68 డాలర్లుగా ఉండగా.. త్వరలో 75 డాలర్లకు పెరగొచ్చు. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన ట్యాంకర్ల రవాణా 60 నుండి 70 శాతం తక్కువగా ఉంది. ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 120 డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ 70 డాలర్లకు చేరుకున్నాయి. యుద్దం మరింత పెరిగితే మునుపటి స్థాయికి చేరుకోవచ్చు. చమురు కంపెనీలు ముడి చమురు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని వల్ల దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో అప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లులు తప్పవు. యుద్దం తగ్గిందని అందరూ అనుకోగా.. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.