
రైళ్లలో దూరం ప్రయాణించేవారు బెర్త్లు రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే పండగలు, సెలవులు ఉన్న సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైమ్లో రిజర్వేషన్ దొరకడం కష్టం. అయితే రైల్వేలు ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగైనిస్ట్ క్యాన్సిలేషన్) కింద రిజర్వేషన్ ఇస్తారు. ఒకే బెర్త్లో ఇద్దరు ప్రయాణించాలి. ఇలాంటి ఆర్ఏసీ కేటగిరి కింద బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీ వసూలు చేస్తుంటారు. అలా చేయడం కరెక్ట్ కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
ఆర్ఏసీలోనే ఉండి బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించని ప్రయాణికులకు ఛార్జీలో కొంత మేర తిరిగి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ప్రజాపద్దుల కమిటీ పేర్కొంది.
కాగా ప్రస్తుతం ఆర్ఏసీ కింద బెర్త్ బుక్ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే కేటగిరి కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్యాసింజర్లు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు టికెట్లో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. త్వరలోనే రైల్వే అధికారులు దీనిని సంబంధించి విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా అమలు అయితే ఆర్ఏసీ రిజర్వేషన్ ఉన్నవారికి వారు చెల్లించ మొత్తం కొంత తిరిగి రానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి