
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు విమానాశ్రయాల్లో చాలామంది తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఛార్జ్ చేసుకోవడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది. పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం లీకై ప్రమాదంలోకి పడే అవకాశముంది. చిన్నపాటి అజాగ్రత్తతో మీరు ఉన్న మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వెళుతుంది. ఇటీవల జ్యూస్ జాకింగ్ అనే సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పబ్లిక్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ మీ ఫోన్లోని డేటాను చోరీ చేయడం లేదా మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడం లాంటివి చేస్తు్న్నారు. అసలు ఈ మోసం ఎలా చేస్తారు..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.
రైల్వే స్టేషన్లు లేదా ఎయిర్పోర్టులు, బస్టాండ్ల లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్టుల ద్వారా ఈ మోసానికి పాల్పడతారు. చార్జింగ్ పెట్టుకున్నప్పుడు మీ ఫోన్లోకి వివిధ మాల్వేర్ల ద్వారా చొరబడతారు. యూఎస్ ఛార్జింగ్ పోర్ట్లు కేవలం ఛార్జింగ్ మాత్రమే కాకుండా డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీంతో హ్యకర్లు యూఎస్బీ పోర్ట్ల ద్వారా ఫోన్లలోకి చొరబడి సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారు. ఈ సమాచారంతో డబ్బులు కొల్లగొడుతున్నారు.
ముందుగానే హ్యాకర్లు పబ్లిక్ యూఎస్బీ పోర్ట్స్ లేదా కేబుళ్లను హ్యాక్ చేస్తారు. ప్రయాణికులు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మాల్వేర్లను పంపించి ఫోన్లోని సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీని ద్వారా ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నారు. వినియోగదారులకు తెలియకుండానే కేబుల్స్, పోర్ట్లలో దాచిన చిప్ల ద్వారా సైబర్ దాడులు పాల్పడుతున్నారు.
మీరు ఈ దాడి బారిన పడకుండా ఉండాలంటే సొంత చార్జర్ లేదా కేబుల్ను ఉపయోగించండి. ఇక యూఎస్బి పోర్ట్కు బదులుగా ఎలక్ట్రికల్ సాకెట్ నుంచి నేరుగా ఛార్జింగ్ పెట్టుకోండి. యూఎస్బీ డేటా బ్లాకర్ను ఉపయోగించండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు డేటా బదిలీకి అనుమతి ఇవ్వొద్దు. మీ మొబైల్ సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచుకోండి. పరిచయం లేని ఛార్జింగ్ కేబుల్స్, పబ్లిక్ పోర్ట్లను ఉపయోగించకపోవడమే మంచిది. ఇటీవల జ్యూస్ జాకింగ్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల చాలామంది దీని బారిన పడి డబ్బులు పొగొట్టుకోవడంలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇలాంటి మెసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పందగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు సైబర్ పోలీసులు.