
ప్రస్తుత కాలంలో పోస్టాఫీస్ పథకాలు అంటేనే బెస్ట్ ఆప్షన్గా మారుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఈ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మీరు సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం మీకు బెస్ట్ ఆప్షన్. ఈ పథకం ద్వారా మీరు చిన్న పొదుపుతో భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం ఎలా ఉంటుంది. దాని వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా రూ.43 లక్షలు సంపాదించవచ్చో తెలుసుకుందాం.
పీపీఎఫ్ అనేది కేంద్రం సపోర్ట్తో నడిచే ఒక పొదుపు పథకం. ఇది రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, పన్ను ప్రయోజనాలు కోరుకునే వారికి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం ప్రస్తుతం 7.9% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇది సురక్షితమైన పెట్టుబడులలో అధిక రాబడిని ఇస్తుంది.
మీరు ప్రతి నెలా రూ.12,500 అంటే రోజుకు దాదాపు రూ.411 పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెడితే.. ఏడాదికి మొత్తం రూ.1.5 లక్షలు జమ అవుతాయి. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మీరు ఈ 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపు రూ.43.60 లక్షలు చేతికి వస్తాయి. ఇందులో రూ.21 లక్షల పైగా వడ్డీ రూపంలోనే వస్తుంది.
పీపీఎఫ్లో డిపాజిట్ చేసే మొత్తం, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం అన్నీ పూర్తిగా పన్ను రహితం. ఇది ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద వర్తిస్తుంది. కేంద్రం హామీ ఇస్తుంది కాబట్టి, మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. ఈ పథకం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. మీరు ఒకేసారి లేదా నెలవారీ 12 వాయిదాలలో డబ్బును జమ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఖాతా తెరిచిన 3, 6 ఏళ్ల మధ్య మీ డిపాజిట్పై తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు.
మీరు పోస్ట్ ఆఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరవాలి. డిజిటల్ యుగంలో మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుండి పీపీఎఫ్ ఖాతాకు ఆన్లైన్లో కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చిన్న మొత్తాలతో దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు రావానుకునే వారికి పీపీఎఫ్ ఒక అద్భుతమైన ఆప్షన్. దీని వల్ల మీరు పన్నులు ఆదా చేసుకోవడమే కాకుండా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పథకం గురించి ఆలోచిస్తున్నట్లయితే, మరింత సమాచారం కోసం మీ సమీప పోస్టాఫీసును సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..