
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ విడత కింద ఒక్కొ లబ్దిదారుడి అకౌంట్లో రూ.2 వేల చొప్పున విడుదల చేశారు. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడుదల నగదును కేంద్రం జమ చేసింది. పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లకుపైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,880 కోట్లకుపైగా జమ చేశారు. దీంతో ఈ నిధులు ఇప్పటికే లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తోన్నారు. రూ. 2 వేల చొప్పున మూడు వాయిదాల్లో అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వేస్తున్నారు.
పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉండి మీకు నిధులు రాలేదా.. అయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ డబ్బులు అందకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇ-కేవైసీ పూర్తి చేయకపోవడం, భూమి రికార్డులను ధృవీకరించకపోవడం, దరఖాస్తులో తప్పుడు వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు అందించడం లాంటి కారణాలతో ఆగిపోయే అవకాశముంది. దీంతో కారణం ఏంటనేది తెలుసుకుని మీ సమస్యను పరిష్కరించుకుంటే నగదు వెంటనే జమ అవుతాయి. ఇంతకు ఎలా ఫిర్యాదు చేయాలనే విషయాలు ఒకసారి చూద్దాం.
లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంది అకౌంట్లో డబ్బులు పడకపోతే మీరు ఫిర్యాదు చేయాలి. కారణం తెలుసుకోవడానికి మీరు 18001801551 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. సిబ్బంది మీ వివరాలు తెలుసుకుని కారణం ఏంటనేది చెబతారు. ఆ సమస్యను పరిష్కరించుకుంటే మీ ఖాతాల్లో డబ్బులు పడే అవకాశముంటుంది. ఈ కేవైసీ, అప్లికేషన్ అప్డేట్ల సహాయం కోసం మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించవచ్చు. ఆ తర్వాత CPGRAMS పోర్టల్లో ఫిర్యాదు చేయండి. ఒక్కో ఫిర్యాదుకు రుసుము రూ. 50 చెల్లించాలి. మీ వివరాలు సమర్పించి ఫిర్యాదు చేయాలి. అధికారులు ఫిర్యాదును స్వీకరించి పరిశీలిస్తారు. అనంతరం సమస్య ఏంటి.. పరిష్కారం వివరాలను మీ దృష్టికి తీసుకొస్తారు. ఇక ఆఫ్లైన్లో సమీపంలోని రైతు సేవా కేంద్రం, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి కారణం ఏంటనేది తెలుసుకోవచ్చు. కాగా కొంతమందికి అర్హత లేకపోయినా తప్పుడు మార్గాల్లో పీఎం కిసాన్ పొందుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు.