
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగించే విషయం తెలిపింది. త్వరలో యూపీఐ విత్ డ్రా సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్పై వర్క్ చేస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి దీనిని అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీంతో దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లామంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్వో వెబ్సైట్లోకి వెళ్లి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్కు దరఖాస్తు చేశాక అకౌంట్లో జమ చేయడానికి చాలా ఆలస్యమవుతుంది. ఇప్పటినుంచి ఇవన్నీ అవసరం లేకుండా ఒకేచోట అన్నీ సేవలు లభించనున్నాయి.
ఈపీఎఫ్ సేవలన్నీ ఒకేచోట పొందేందుకు కేంద్రం కొత్త యాప్ను తీసుకురానుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడంతో పాటు పాస్బుక్ బ్యాలెన్స్, ఇతర సేవలు అన్నీ ఇక్కడ ఒకేచోట పొందవచ్చు. ఈ కొత్త యాప్లో యూపీఐ ఆప్షన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లోని నగుదును విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా నగదు జమ అవుతాయి. ఇక ఈ యాప్లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇతర సేవలు కూడా ఇక్కడే పొందవచ్చు. దీంతో ఈపీఎఫ్ చందాదారులు వేర్వేరు వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లను సందర్శించాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతా వివరాలను యాక్సెస్ చేయాడానికి లేదా సేవలకు ఈపీఎఫ్వో పోర్టల్, ఉమాగ్ యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త యాప్లో అన్నీ సేవలు ఒకేచోట యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్లో పీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు. అనంతరం పీఎఫ్ విత్ డ్రా ఆప్షన్ సెలక్ట్ చేసుకుని యూపీఐను ఎంచుకోవాలి. యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లోకి నిధులు ట్రాన్స్ఫర్ అవుతాయి. కొత్త పీఎఫ్ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా.. ఏప్రిల్లో దీనిని లాంచ్ చేసేందుకు కార్మికశాఖ సిద్దమవుతోంది. ఇక ఆటోమేటిక్ సెటిల్మెంట్ ఇలా యూపీఐ విధానంలో జరగనుంది. అలాగే రూ.5 లక్షల వరకు నగదు ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసుకునేలా పరిమితి పెంచనున్నారు. ప్రస్తుతం రూ.లక్ష ఉండగా.. ఆ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నారు. దీంతో ఉద్యోగులు తమ అవసరాల కోసం వెంటనే పీఎఫ్ నగదును ఉపసంహరించవచ్చు. కాగా త్వరలో పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచనున్నారు.