
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీపికబురు అందించింది. త్వరలో పీఎఫ్ క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్ చేయనుంది. ఇందుకు ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల జాప్యం తగ్గి నిధులు నేరుగా ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ కానున్నాయి. గతంలో కేవలం అడ్వాన్స్ క్లెయిమ్స్ కు మాత్రమ ఆటో సెటిల్మెంట్ విధానం అమల్లో ఉండేది. అయితే ఇక నుంచి ఫైనల్ క్లెయిమ్స్ విధానానికి కూడా ఆటో సెటిల్మెంట్ సౌకర్యం కల్పించనున్నారు. దీని వల్ల ఖాతాదారులకు వేగంగా డబ్బులు అందనున్నాయి. ఆటో ప్రాసెసింగ్ వల్ల కాగితపు పని తగ్గి పేపర్ లెస్ విధానంలో వేగవంతంగా క్లెయిమ్స్ పొందవచ్చు.
ఈపీఎఫ్ఓ సెంటర్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇంతకముందు కేవలం అడ్వాన్స్ క్లెయిమ్స్ కోసం మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు తుది ఉపసంహరణకు కూడా ఆటో సెటిల్మెంట్ విధానం త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి కొన్ని ఉపసంహరణలకు మాత్రమే ఆటో సెటిల్మెంట్ విధానం అమల్లో ఉందని స్పష్టం చేశారు. రూ.5 లక్షల్లోపు అడ్వాన్స్ క్లెయిమ్స్ ను ఆటో సెటిల్మెంట్ విధానంలో ప్రాసెస్ చేస్తున్నామని, త్వరలో తుది ఈపీఎఫ్ఓ ఉపంసహరణకు కూడా ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల కాగితపు పని తగ్గుతుందని, అలాగే పదవీ విరమణ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని అన్నారు. చాలామంది తరుచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. అలాంటివారు తమ ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన వాటిని తీసుకోవాలంటే ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
అకస్మాత్తుగా ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈపీఎఫ్ క్లెయిమ్స్ లో జాప్యం జరుగుతోంది. దీంతో చందాదారులు నిరాశ చెందుతున్నారు. ఇక సుదీర్ఘ ప్రాసెసింగ్, టెక్నికల్ ప్రాబ్లంలు, యజమాని వెరిఫికేషన్ వంటి ప్రక్రియ వల్ల క్లెయిమ్స్ లో ఆలస్యం జరుగుతోంది. దీంతో ఆటోమేటిక్ అకౌంట్ మైగ్రేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.