
Personal Finance: కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలలో అతి ముఖ్యమైనది సుకన్య సమృద్ధి యోజన (SSY). ఆడపిల్లల కోసం ఉన్న ప్రముఖ పెట్టుబడి పథకాలలో ఒకటి. ఈ చిన్న పొదుపు పథకాన్ని ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించారు. అలాగే ఇది ప్రస్తుతం సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును, వార్షికంగా చక్రవడ్డీ పద్ధతిలో అందిస్తుంది. ఒకవేళ ఆడపిల్ల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో తమ వార్షిక డిపాజిట్ల పూర్తి పరిమితిని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెడితే, వారు ఆ ఆడపిల్ల చదువు లేదా వివాహం కోసం ఉపయోగపడే గణనీయమైన మొత్తాన్ని సృష్టించగలరు.
SSY నిబంధనల ప్రకారం.. బాలికకు 10 సంవత్సరాల వయస్సు రాకముందే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమె పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు పెట్టుబడులు కొనసాగవచ్చు. అయితే 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 250 కాగా, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టవచ్చు. ప్రస్తుత వడ్డీ రేట్ల విధానం ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజనలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000, రూ. 1 లక్ష, రూ. 1.5 లక్షల పెట్టుబడులు దీర్ఘకాలంలో ఎలా వృద్ధి చెందవచ్చో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!
ఒకవేళ తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 50,000 పెట్టుబడి పెడితే, వారు పెట్టే మొత్తం పెట్టుబడి రూ. 7.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత వార్షిక 8.2% వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ కార్పస్ రూ.23.94 లక్షలకు పైగా పెరగవచ్చు. ఈ సుకన్య సమృద్ది పథకంలో మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతారు. కానీ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు కాబట్టి, మీరు పెట్టుబడి పెట్టకుండానే మరో 6 సంవత్సరాల పాటు చక్రవడ్డీని పొందుతారు.
ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1 లక్ష డిపాజిట్ × 15 సంవత్సరాలు = రూ. 15 లక్షల డిపాజిట్. ప్రస్తుత ఈ పథకంలో వడ్డీ రేటు ప్రకారం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ కార్పస్ సుమారు రూ.47 లక్షలకు పైగా పెరగవచ్చు.
ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల డిపాజిట్ × 15 సంవత్సరాలు = రూ. 22.5 లక్షల డిపాజిట్. ప్రస్తుత 8.2% వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 71 లక్షల వరకు పెరగవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద పన్ను ప్రయోజనాలు EEE (ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్) పన్ను హోదాను కూడా అందిస్తాయి. పాత పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద పెట్టుబడులు మినహాయింపుకు అర్హత పొందుతాయి. సంపాదించిన వడ్డీ పన్ను రహితం. మెచ్యూరిటీ రాబడి కూడా పన్ను రహితం.
ఆధార్ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించి ఈ పథకం ఖాతాను తెరవవచ్చు. సంరక్షకునికి ఆధార్ నంబరు కేటాయించనట్లయితే సుకన్య సమృద్ది ఖాతాను తెరవడానికి ఆధార్ నమోదు నంబరు, రుజువును అందించవచ్చు. కానీ ఖాతాదారుడు ఖాతా తెరిచిన తేదీ నుండి ఆరు నెలలలోపు అనుసంధానం కోసం ఆధార్ను సమర్పించాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి ఆరు నెలలలోపు ఆధార్ సమర్పించనట్లయితే, అతను తన ఆధార్ కార్డు నంబరును సమర్పించేంత వరకు ఆ ఖాతా పనిచేయదు.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను మీకు సమీపంలోని పోస్టాఫీసులో లేదా ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో తెరవచ్చు. ఆడపిల్ల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులు/సంరక్షకుల గుర్తింపు కార్డు, పాన్ కార్డు అవసరం. అలాగే బాలిక, తల్లిదండ్రుల పాస్పోర్ట్ సైజు ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు కనీస డిపాజిట్ మొత్తం రూ.250 చెల్లించాలి. ఈ పథకంలో మదుపు చేయడం ద్వారా ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మెచ్యూరిటీ మొత్తంపైనా ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు.
ఇది కూడా చదవండి: Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి