
Ola Electric Mobility Ltd తన భౌతిక రిటైల్ నెట్వర్క్ను గణనీయంగా తగ్గించుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్ల సంఖ్యను సుమారు 550కు కుదించాలని కంపెనీ యోచిస్తోంది. మార్కెట్ షేర్ తగ్గడం, ఆపరేషనల్ సమస్యలు వంటి సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం దేశవ్యాప్తంగా 4,000 స్టోర్లను ప్రారంభించాలని అంబిషస్ ప్రణాళికను ప్రకటించిన కంపెనీకి ఇది పెద్ద వెనుకడుగు అని చెప్పవచ్చు. తాజాగా విడుదల చేసిన త్రైమాసిక (Q3) అప్డేట్లో, ఇప్పటికే స్టోర్ల సంఖ్యను సుమారు 700కు తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని “స్ట్రక్చరల్ రీసెట్”లో భాగంగా పేర్కొంది.
కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో “సర్వీస్ అమలు మెరుగుపరచడం, ఖర్చు నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, వెర్టికల్ ఇంటిగ్రేషన్ను, బలపరచడం ద్వారా మౌలిక అంశాలను సరిచేసే దిశగా చర్యలు తీసుకున్నాం. దీని ఫలితంగా తక్కువ బ్రేక్ఈవెన్ స్థాయితో మరింత సమర్థవంతమైన ఆపరేటింగ్ మోడల్ను ఏర్పరచుకున్నాం” అని తెలిపింది.
మీడియా నివేదికల ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న షోరూమ్లు మూసివేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనేక ఉద్యోగులను కూడా ఉద్యోగాల నుంచి తప్పించినట్లు సమాచారం. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ ద్వారా రూ. 470 కోట్ల సమీకృత ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో 32,680 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. అయితే ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 61 శాతం తగ్గుదలగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Insurance Scheme: శుభవార్త అంటే ఇది.. కేవలం ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్!
ఒకప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో అగ్రగామిగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు TVS Motor Company, Bajaj Auto, Hero MotoCorp వంటి స్థిరపడ్డ సంస్థలతో పాటు Ather Energy వంటి కొత్త పోటీదారుల వెనుకబడింది. ఇక మహారాష్ట్రలో కంపెనీకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. 2025లో మహారాష్ట్ర ప్రభుత్వం ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్టోర్లను మూసివేయాలని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ముంబై, పుణే ప్రాంతాల్లో ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించి అనేక “ఎక్స్పీరియన్స్ సెంటర్లు” సరైన అనుమతులు లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Gold, Silver Price: గుడ్న్యూస్. భారీగా తగ్గిన వెండి ధర.. ఎంత తగ్గిందో తెలుసా..?
ఈ పరిణామాల మధ్య సోమవారం బీఎస్ఈలో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు గరిష్టంగా 3.20 శాతం వరకు పడిపోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక్కో షేర్ ధర రూ. 25.72కు చేరుకుంది. కంపెనీ లిస్టింగ్ సమయంలో షేర్ ధర రూ. 76గా ఉండటం గమనార్హం. మొత్తంగా వ్యాపార పరమైన సవాళ్లు, మార్కెట్ పోటీ, నియంత్రణ సమస్యల నడుమ ఓలా ఎలక్ట్రిక్ తన వ్యూహాన్ని పునర్వ్యవస్థీకరించుకుంటూ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా తమ రిటైల్ నెట్వర్క్ని 4000 స్టోర్లకు విస్తరిస్తామని ప్రకటించగా ఇప్పుడు ఆ సంఖ్యను 550కి పరిమితం చేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు షాకింగ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి