Toll Rules: నేషనల్ హైవేలపై నేటి నుంచి కొత్త రూల్స్.. పరిమితి దాటితే బాదుడే.. కేంద్రం కఠిన నిబంధనలు

జాతీయ రహదారులపై టోల్ ఫీజుల విధానంలో కేంద్రం అనేక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలపై ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. పరిమితికి మించి వెళ్లే వాహనాలకు భారీగా పెనాల్టీ విధించనున్నారు.

Toll Rules: నేషనల్ హైవేలపై నేటి నుంచి కొత్త రూల్స్.. పరిమితి దాటితే బాదుడే.. కేంద్రం కఠిన నిబంధనలు
Toll Charges

Updated on: Apr 15, 2026 | 1:20 PM

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో టోల్ ఫీజులకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాలు కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి. ఇటీవల టోల్ ఫీజు విధానంలో అనేక మార్పులు చేస్తున్న కేంద్రం.. తాజాగా మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు కఠిన నిబంధనలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి నేషనల్ హైవేలపై ఓవర్ లోడ్‌తో వెళితే అదనపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు పరిమితికి మంచి ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను భారీగా పెంచింది.

40 శాతం దాాటితే 4 రెట్లు ఎక్కువ

తాజాగా జాతీయ రహదారుల ఫీజుల నాలుగో సవరణ నిబంధన 2026ను కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. ఇందులో ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా భారీగా పెనాల్టీలు వసూలు చేయనుంది. పరిమితికి మంచి అదనంగా ఎంత ఓవర్ లోడ్‌తో వెళ్తున్నారనేది లెక్కించి జరిమానా విధిస్తారు. అయితే నిబంధన ప్రకారం ఉన్న పరిమితికి మంచి 10 శాతం వరకు ఓవర్ లోడ్ ఉన్నా ఎటువంటి జరిమానాలు ఉండవు. 10 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటే 2 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. ఇక 40 శాతం కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నారు. ఇక ఈ పెనాల్టీలను కూడా ఫాస్టాగ్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది.

డిజిటల్ కాంటాలు ఏర్పాటు

టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ కాంటాలను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ధర్మ కాంటాల ఏర్పాటు లేని టోల్ గేట్ల వద్ద ఎలాంటి పెనాల్టీలు ఉండవు. వీటి సౌకర్యం అందుబాటులో ఉన్న చోట్ల జరిమానాలు విధిస్తారు. జాతీయ రహదారులను పరిరక్షించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం గురించి వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి. కాగా ఇటీవల కేంద్రం టోల్ ఛార్జీలకు సంబంధించి అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి నగదు చెల్లింపులను పూర్తిగా బంద్ చేసింది. కేవలం ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులను స్వీకరిస్తోంది.  అలాగే టోల్ ఫీజు కట్టకుండా వెళ్లితే భారీగా జరిమానా విధించనుంది.

Follow Us