
కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ కొత్త కనెక్షన్ల జారీపై ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో కొత్త కనెక్షన్ల జారీని అప్పటినుంచి ప్రభుత్వం నిలిపివేసింది. 2026 మార్చి నుంచి 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అప్పటినుంచి కంపెనీలు కొత్త కనెక్షన్లను జారీ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం, కేవైసీ అప్డేట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. గ్యాస్ కనెక్షన్ల జారీని ఆపేసిన క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 5,10 కిలోల చిన్న సిలిండర్లను అందుబాటులోకి తెచ్చాయి. జస్ట్ ఏదైనా ధృవీకరణ పత్రం చూపించి వీటిని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో లేదా రిటైల్ అవుట్ లెట్లలో తీసుకోవచ్చు.
ప్రభుత్వం తాత్కాలికంగా మాత్రమే గ్యాస్ కనెక్షన్ల జారీని నిలిపివేసింది. అయితే శాశ్వతంగా నిలిపివేయలేదు. దీంతో ఎప్పుడైనా తిరిగి ప్రారంభించే అవకాశముంటుంది. ఈ క్రమంలో కొత్త ఎల్పీజీ కనెక్షన్ల జారీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల క్రమంలో ఎల్పీజీ సరఫరా, లభ్యత మెరుగుపడిన వెంటనే కొత్త కనెక్షన్లను పున:ప్రారంభిస్తామని తెలిపింది. ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసులేదని, తదుపరి ప్రకటన కోసం ప్రజలు వేచి ఉండాలని పెట్రోలియం మంత్రిత్వశాఖ సూచించింది. కొత్త కనెక్షన్ల నిలిపివేత అనేది తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లను ఇవ్వకపోవడంతో.. 5 కేజీలు లేదా 10 కేజీల సిలిండర్లను తీసుకోవాలని సూచించింది. సిటీల్లో 10 కేజీల ఎఫ్టిఎల్(ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్లను ఎక్కువమంది తీసుకున్నారు. వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి అందుతుంది. సిలిండర్ల లభ్యత, బుకింగ్ నియమాలు నగరం, పంపిణీదారుని బట్టి మారుతూ ఉంటాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇదే పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందనేది అంచనా వేయడం కష్టం. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల క్రమంలో భారత్కు చేరుకోగల ఎల్పీజీ నౌకల సంఖ్యపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రభుత్వంతో పాటు చమురు కంపెనీలు ప్రస్తుత గ్యాస్ నిల్వలు, సరఫరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి బదులు కేవైసీ పూర్తి చేయడం, నకిలీ, రెండు కనెక్షన్లు ఉన్నవారిని గుర్తించడంపై దృష్టి పెట్టింది. అలాగే రద్దయిన కనెక్షన్లను పునరుద్దరించడంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకే వేగంతంగా గ్యాస్ సరఫరా చేయడంపై కంపెనీలు ఎక్కువ ఫోకస్ పెట్టాయి. ఇటీవల కాలంలో అత్యంత వేగంగా ఒక రోజులోనే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీ చేస్తున్నారు.