
జూన్ 15 సోమవారం నాడు పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు యథాతథంగా ఉన్నాయి. ఆయిల్ మార్కెట్ కంపెనీలు (OMCలు), సహజ వాయువు పంపిణీ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం, హర్ముజ్ జలసంధి అందరి కోసం తెరుచుకుంటుంది అంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రజలు భావించారు. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో, మన దేశంలో కూడా ఇంధన ధరలు తగ్గుతాయని ఆశపడ్డారు. ఇప్పటికైతే ఎలాంటి తగ్గింపు భారతీయ కంపెనీలు ప్రకటించలేదు.
కాగా కొన్ని వారాల ముందు పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో పెరిగిన ముడి చమురు ధరల కారణంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 7.5 మేర పెంచాయి. గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం, పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు రిటైల్ ఇంధన దుకాణాల నుండి పెట్రోల్ మరియు హై-స్పీడ్ డీజిల్ (HSD) కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. బదులుగా, వారు తమ అవసరాలను బల్క్ సేల్ పాయింట్లు లేదా వారి సొంత కన్స్యూమర్ పంపుల ద్వారా పొందాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు ప్రారంభంలో గరిష్టంగా 90 రోజుల పాటు అమలులో ఉంటాయి మరియు కొత్త ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా వీటిని పొడిగించే అవకాశం ఉంది.
గత మూడు నెలల్లో ఇది రెండవ పెంపు కాగా, 2026 జూన్ 07 నుంచి గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 29 మేర పెరిగాయి. తాజా ఎల్పీజీ ధరల పెంపుతో, ఢిల్లీలో ప్రామాణిక 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు పెరిగింది. వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలు జూన్ 1 నుంచి పెరిగాయి. దీనితో ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 42 పెరిగి రూ. 3,113.50కి చేరింది. జూన్ 1 నుండి ప్రారంభమయ్యే పక్షం రోజుల పాటు పెట్రోల్, డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) పై ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తగ్గించింది. సవరించిన ఎగుమతి సుంకం ప్రకారం పెట్రోల్పై లీటరుకు రూ. 1.5, డీజిల్పై లీటరుకు రూ. 13.5, ATFపై లీటరుకు రూ. 9.5గా ఉంది. ముంబైలో ఇంతకుముందు CNG ధరలు కిలోకు రూ. 2 పెరిగి రూ. 86కి చేరాయి. ఇదే మొత్తంలో ధర పెరిగిన 15 రోజుల తర్వాత ఇది జరిగింది. దేశీయ గ్యాస్ PNG ధర ఒక ప్రామాణిక క్యూబిక్ మీటరుకు (SCM) 50 పైసలు పెరిగి రూ. 52కి చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి