క్యాలెండర్లో మరో పేజీ మారింది. ఏప్రిల్ నెల ముగిసింది. మే నెల వచ్చేసింది. ఎప్పటిలాగే ఇవాల్టి (మే1) నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. దీంతో వినియోగదారులు ముందస్తుగా అప్రమత్తమై ఉండాలి. మారే నిబంధనలు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే జేబులకు చిల్లులు పడడం ఖాయం. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తుంటాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఏటీఎం ఛార్జీలు.. ఇలా ఇంకెన్నో నిర్ణయాలు ఉంటుంటాయి. అలా మే 1 నుంచి కూడా పలు నిబంధనలు, నియమాలు మారుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుని ముందుగా జాగ్రత్త పడదాం.
ఈ నెల పంజాబ్ నేషనల్ బ్యాంకు తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం ఛార్జీల్లో కీలక మార్పులు చేసింది. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధించనుంది.
ఈ నెలలో జీఎస్టీలో కొత్త రూల్స్ రానున్నాయి. వ్యాపారులు ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదుని 7 రోజులలోపు ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. నేటి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల కోసం వస్తువులు, సేవా పన్నుల్లో ఈ మార్పు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలు ఐఆర్పీలో ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశాలు జారీ చేసింది. అంటే మీ ఈ-వాలెట్కు కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టలేరు. నేటి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
ప్రతి నెల ఒకటో తారీఖును గ్యాస్ ధరలలో మార్పులు జరగడం చూస్తూనే ఉన్నాము. అలాగే మే 1న ఎల్పీజీగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేశారు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.171.50 మేర తగ్గిస్తున్నట్లుగా ప్రకటించాయి.
సీఎన్జీ, పీఎన్జీ ధరలు కూడా ప్రతి నెల 1వ తేదీన లేదా నెల మొదటి వారంలో సవరిస్తారు. ఢిల్లీ, ముంబై తదతర నగరాల్లో నెల మొదటి వారంలో పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను మారుస్తాయి. అలా మే ప్రారంభంలో సీఎజ్జీ ధరల్లో మార్పు ఉండవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..