
తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆస్తుల పంపిణీ విషయంలో చాలా కుటుంబాల్లో వివాదాలు రావడం సహజం. ముఖ్యంగా తండ్రి రాసి వీలునామా రిజిస్టర్ కాకపోతే, దానికి అసలు చట్టబద్ధతే ఉండదని చాలామంది భావిస్తుంటారు. అయితే భారత వారసత్వ చట్టాల ప్రకారం ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు న్యాయ నిపుణులు ఇచ్చిన స్పష్టత ఇవ్వడంతో రిజిస్టర్ కాని వీలునామా చెల్లుబాటు, ఆస్తిపై కొడుకులు, కూతుళ్ల హక్కుల గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన తండ్రి 2022లో మరణించారు. ఆయనకు ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. తండ్రి తన సొంత సంపాదనతో కొన్న ఆస్తిపై ఒక వీలునామా రాసి పెట్టారు.. కానీ దాన్ని రిజిస్టర్ చేయలేదు. అయితే 2024లో కూతుళ్లు హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం తమకు ఆస్తిలో సమాన వాటా కావాలని కోర్టును ఆశ్రయించారు. పంపిణీ కాని ఈ ఆస్తిపై నిపుణులు ఏం చెప్పారంటే..
భారత వారసత్వ చట్టం 1925 ప్రకారం వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. సరిగ్గా రాసి, ఇద్దరు సాక్షుల సమక్షంలో సంతకాలు జరిగితే, రిజిస్టర్ కాని విల్లు కూడా చట్టబద్ధంగా సంపూర్ణంగా చెల్లుబాటు అవుతుంది. అయితే ఆ వీలునామా బలవంతంగా రాయించారని, ఫోర్జరీ అని లేదా రాసే సమయంలో తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేదని కోర్టులో నిరూపిస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆ రిజిస్టర్ కాని వీలునామా ఆధారంగానే ఆస్తి పంపిణీ జరుగుతుంది.
ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. సదరు తండ్రి ఆస్తి తన సొంత సంపాదనతో సంపాదించింది.
స్వయంకార్జిత ఆస్తి: ఒక వ్యక్తి తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిపై ఆయనకు పూర్తి హక్కులు ఉంటాయి. దానిని విల్లు ద్వారా తనకు నచ్చిన వారికి రాసిచ్చే పూర్తి చట్టబద్ధమైన అధికారం ఆయనకు ఉంటుంది.
పిత్రార్జిత ఆస్తి: ఇది తాతముత్తాతల నుండి వారసత్వంగా వచ్చే ఆస్తి. దీనికి మాత్రమే ఉమ్మడి కుటుంబ చట్టాలు వర్తిస్తాయి.
హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 ప్రకారం కూతుళ్లకు పుట్టుకతోనే తండ్రి పిత్రార్జిత ఆస్తిలో కొడుకులతో సమానంగా హక్కు లభిస్తుంది. అయితే చెల్లుబాటు అయ్యే వీలునామా ఉన్నప్పుడు మాత్రం ఆస్తి పంపిణీ వీలునామాలో రాసిన నిబంధనల ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ వీలునామాలో కూతుళ్లకు వాటా కేటాయిస్తే వారు దానిని పొందవచ్చు. వీలునామా అంశాలపై అనుమానాలు ఉంటే వారు కోర్టులో సవాలు చేసే హక్కు కూడా కూతుళ్లకు ఉంటుంది.
ఒకవేళ తండ్రి రాసిన విల్లులో ఆయనకున్న మొత్తం ఆస్తుల ప్రస్తావన లేకుండా కేవలం కొన్ని ఆస్తుల గురించే ఉంటే.. మిగిలిన ఆస్తులను ఇంటెస్టేట్ ప్రాపర్టీగా పరిగణిస్తారు. అలా మిగిలిపోయిన ఆస్తులపై హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం క్లాస్ 1 వారసులైన కొడుకులు, కూతుళ్లు, భార్య, తల్లి అందరికీ సమాన హక్కులు లభిస్తాయి.