భారత చరిత్రలోనే మొట్టమొదటిసారి..! ఒకే ఏడాదిలో ఎన్ని కీలక ఒప్పందాలంటే..?

ఈ ఏడాది భారత్ ఐదు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది, ఇది దేశ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో సహా ఈ ఒప్పందాలు ప్రపంచ GDPలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఇది ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

భారత చరిత్రలోనే మొట్టమొదటిసారి..! ఒకే ఏడాదిలో ఎన్ని కీలక ఒప్పందాలంటే..?
India Trade Agreements

Updated on: Feb 03, 2026 | 4:52 PM

భారతదేశ ఆర్థిక చరిత్రలో తొలిసారిగా దేశం కొన్ని రోజుల్లోనే రెండు ప్రధాన వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఏడాది మొత్తం ఐదు వాణిజ్య ఒప్పందాలపై భారత్‌ సంతకం చేసింది. ఇది ప్రపంచ GDPలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. గత కొన్ని నెలలుగా భారత్‌, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాతో కూడా భారత్‌ ట్రేడ్‌ డీల్‌ను సెట్‌ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025) భారత్‌ మొత్తం ఎగుమతుల్లో సుమారు 20 శాతం, భారతదేశ దిగుమతుల్లో 6.3 శాతం వాటాను కలిగి ఉన్న అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

ఒక ఏడాదిలో 5వ వాణిజ్య ఒప్పందం

కొద్ది రోజుల క్రితం భారత్‌, యూరోపియన్ యూనియన్ కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ఆమోదించాయి. భారతదేశ ఆర్థిక చరిత్రలో ప్రపంచంలోని రెండు అతిపెద్ద వాణిజ్య కూటములతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. దీనితో గత సంవత్సరంలో భారతదేశం మొత్తం వాణిజ్య ఒప్పందాల సంఖ్య ఐదుకు చేరుకుంది. US, యూరోపియన్ యూనియన్ కంటే ముందు, భారత్‌ యునైటెడ్ కింగ్‌డమ్ (UK), ఒమన్, న్యూజిలాండ్‌లతో కూడా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది.

ప్రపంచ GDPకి 50 శాతం కంటే ఎక్కువ

2025 నాటికి ప్రపంచ GDPలో భారత్‌ వాటాను పరిగణనలోకి తీసుకుంటే.. భారత్‌, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ (27 దేశాలు), యునైటెడ్ కింగ్‌డమ్, ఒమన్, న్యూజిలాండ్‌ల సంయుక్త వాటా 50 శాతం నుండి 55 శాతం వరకు ఉంటుంది. EU, ప్రపంచ GDPలో భారతదేశం వాటాను కలిపితే, అది దాదాపు 25 శాతం అవుతుంది. బంగ్లాదేశ్ (20 శాతం), వియత్నాం (20 శాతం), థాయిలాండ్ (19 శాతం) వంటి దేశాలపై అమెరికా సుంకాలు ఇప్పుడు భారతదేశంపై ఉన్న సుంకాలను మించిపోతున్నందున అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరింత ముఖ్యమైనది.

ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ భాగం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, తర్వాత భారత్‌ నాల్గవది. ఇటీవలి వరకు బ్రిటన్ టాప్ ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. అందువల్ల ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక వ్యవస్థలలో ఒక పెద్ద సమూహం ఇప్పుడు వాణిజ్యం ద్వారా భారత్‌ బలంగా ముడిపడి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో వారి సంయుక్త వాటా 38 నుండి 40 శాతం వరకు ఉంటుందని అంచనా.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి