Vande Bharat Sleeper: వావ్.. వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. రైల్వేశాఖ లైనప్ మాములుగా లేదుగా..

Indian Railways: వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం దేశంలోని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఒక వందే భారత్ స్లీపర్ రైలు మాత్రమే నడుస్తోంది. జనవరిలో హౌరా-గువహతి మధ్య తొలి రైలును మోదీ ప్రారంభించారు. ఇక త్వరలో మరిన్ని రైళ్లను తీసుకురానుందని ప్రకటించిన రైల్వేశాఖ.. తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.

Vande Bharat Sleeper: వావ్.. వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. రైల్వేశాఖ లైనప్ మాములుగా లేదుగా..
Vande Bharat Sleeper Train

Updated on: Feb 06, 2026 | 1:12 PM

వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై భారత రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్లను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశంలోనే వీటిని తయారు చేస్తోంది. ప్రజలు వేగవంతమైన, మోడ్రన్ సౌకర్యాలతో ప్రయాణం అందించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాత్రి వేళ ప్రయాణంలో మార్పులు తెచ్చేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను దేశవ్యాప్తంగా నలుమూలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే భారీగా ఈ రైళ్ల తయారీ చేపడుతోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వీటిని దశలవారీగా ప్రారంభించనుంది. ఈ క్రమంలో తాజాగా దీనిపై భారతీయ రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది.

260 వందే భారత్ రైళ్లు

మెరుగైన భద్రత, ఆధునిక సౌకర్యాలు, ప్రపంచ స్థాయి ప్రయాణాలతో రాత్రిపూట ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అభివృద్ది చేస్తున్నట్లు రైల్వేశాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 260 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో ఇవి రూపుదిద్దుకుంటున్నాయని తెలిపింది. ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆటోమేటెడ్ సెన్సార్ డోర్లు, అత్యాధునిక బయో టాయిలెట్లు, భద్రత కోసం సీసీ కెమెరాలు, నిద్రపోయేందుకు వీలుగా మెరుగైన కుషనింగ్ బెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. విమానాల తరహాలో లగ్జరీ లుక్‌తో ఈ రైళ్లు కనిపిస్తాయి. రాత్రిపూట ఎలాంటి కుదుపులు, శబ్దాలు వీటిల్లో వినిపించవు. దీంతో హాయిగా నిద్రపోతూ ప్రయాణం చేయవచ్చు.

తొలి రైలు పరుగులు

జనవరి 17న ప్రధాని మోదీ దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. హౌరా-గువహతి మధ్య దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైలు ప్రయాణికులకు సర్వీసులు అందిస్తోంది. ఈ రైలు రాకతో హౌరా-గువహతి మధ్య మూడు గంటల ప్రయాణ సమయం తగ్గింది. ఇక త్వరలో దేశవ్యాప్తంగా వీటిని తీసుకురానుండగా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి ట్రైన్ సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రూట్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉండగా.. ఇందులో ఒకరోజు పాటు సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెడితే గంటల వ్యవధిలోనే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చు. కేవలం 20 గంటల కంటే తక్కువ సమయంలో రెండు నగరాల మధ్య ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 10 వందే భారత్ స్లీపర్ ట్రైన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఎంఈఎల్ సహకారంతో ఈ రైళ్లను తయారుచేస్తున్నారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-పుణె, ఢిల్లీ-హౌరా, సీల్దా-ఢిల్లీ మార్గాల్లో తొలుత స్లీపర్ రైళ్లను తీసుకురావాలని రైల్వేశాఖ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.