
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఏర్పడుతున్న అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గృహ వినియోగదారులకు పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్జీ)కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ (సప్లై కంట్రోల్) ఆర్డర్ – 2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం పెట్రోకెమికల్ ప్లాంట్లు, రిఫైనరీలు వంటి పారిశ్రామిక రంగాల నుంచి గ్యాస్ను మళ్లించి ముందుగా గృహాలకు పీఎన్జీ సరఫరా చేయాలని నిర్ణయించారు.
పశ్చిమాసియాలో ఇంధన మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం పెరగడం వల్ల సముద్ర మార్గాల ద్వారా జరిగే గ్యాస్ సరఫరాపై అనిశ్చితి నెలకొంది. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సగానికి పైగా ఈ సముద్ర మార్గాల ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో దేశీయ ఇంధన అవసరాలను భద్రపరచేందుకు కేంద్ర ప్రభుత్వం 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టం కింద ఉన్న అధికారాలను ఉపయోగించింది. అవసరమైతే వాణిజ్య ఒప్పందాలను సవరించే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది.
కొత్త ఉత్తర్వు ప్రకారం ప్రయారిటీ సెక్టార్–1లో దేశీయ పీఎన్జీ, వాహనాలకు సరఫరా చేసే సీఎన్జీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గత ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ రంగాలకు 100 శాతం గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించారు. అంటే జాతీయ గ్యాస్ గ్రిడ్లో అందుబాటులో ఉన్న గ్యాస్ను ముందుగా గృహాల వంటశాలలకు మరియు వాహనాల సీఎన్జీ స్టేషన్లకు సరఫరా చేసి, తరువాత మాత్రమే పరిశ్రమలకు పంపిస్తారు. గ్యాస్ కంపెనీల ప్రకారం గృహాలకు సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని తెలిపారు. మధ్యప్రదేశ్లోని అవంతిక గ్యాస్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ మనీష్ వర్మ మాట్లాడుతూ యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొనుగోలు ఖర్చు పెరిగినా ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిని నగరాల్లో గృహ వినియోగదారులకు సరఫరా ప్రభావితం కాదన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని గ్రీన్ గ్యాస్ లిమిటెడ్ అధికారులు లక్నో, ఆగ్రా నగరాల్లో పీఎన్జీ డిమాండ్ పూర్తిగా తీరుతోందని తెలిపారు.
అయితే పరిశ్రమలకు గ్యాస్ సరఫరా కొంత తగ్గే అవకాశం ఉంది. కొన్ని పారిశ్రామిక వినియోగదారులకు వారి సగటు వినియోగంలో సుమారు 80 శాతం మాత్రమే సరఫరా చేయబడుతుంది. ప్రపంచ సరఫరా సంక్షోభం ఉన్నప్పటికీ గృహ వంటశాలలు, అవసరమైన సేవలకు గ్యాస్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి