
మోదీ ప్రభుత్వం గతంలో పాత పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశంలో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికీ మీ దగ్గర రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా..? వాటిని మార్చుకోకుండా అలాగే ఇంట్లో బీరువాలో దాచి పెట్టుకున్నారా? నిషేధమైన పాత నోట్లను ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటున్నారా..? ఒకవేళ ఈ నోట్లు మీ వద్ద ఉంచుకుంటే అది నేరమవుతుందా..? అధికారులు పట్టుకుంటే జరిమానా ఏమైనా విధిస్తారా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర 10 వరకు పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు ఉంటే అది నేరం కాదట. ఇష్టంతో పాతకాలపు కరెన్సీని సేకరించేవారు తమ వద్ద 25 నోట్ల వరుకు ఉంచుకోవచ్చు. మిగతావారు 10 కంటే ఎక్కువ నోట్లు గనుక మీ వద్ద ఉంచుకుంటే అది ఖచ్చితంగా ఇబ్బందే అవుతుంది. అధికారులు పట్టుకుంటే మీకు రూ.10 వేల వరకు జరిమానా విధించొచ్చని చట్టం చెబుతోంది. లేదా మీ దగ్గర ఉన్న నోట్ల విలువకు ఐదు రేట్లు ఫైన్ విధించే అవకాశముంది. జరినామా విధిస్తారు తప్ప కేసులు, జైలుశిక్ష లాంటివి ఏమీ ఉండవు.
ఎక్కువ నోట్లను ఉంచుకోవడం నేరంగా పరిగణించరు. కానీ జరిమానా భారీగా చెల్లించాల్సి ఉంటుంది. రద్దు అయిన నోట్లు చలామణిలో లేవనే విషయం తెలిసిందే. వాటిని ఎక్కడా ఉపయోగించడం కూడా కుదరదు. చట్టబద్దంగా వాటిని రద్దు చేశారు కాబట్టి అవి ఎక్కడా చెల్లనే చెల్లవు.
నవంబర్ 8,2016న పాత నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత పాత నోట్లను బ్యాంకులు, ఏటీఎంకు వెళ్లి మార్చుకునేందుకు కొంత సమయం ఇచ్చారు. రద్దు అయిన పాత రూ.500, రూ.వెయ్యి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2 వేల నోట్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత రూ.2 వేల నోట్లను కూడా రద్దు చేయగా.. ప్రస్తుతం రూ.500 నోటు చలామణిలో ఉంది.