
భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట మీద నుంచి కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ శ్లాబుల మార్పుతో దేశంలో సరుకుల ధరలు మరింత తగ్గి సామన్యుడిపై భారం తగ్గిపోతుందన్నారు మోదీ. ఈ ప్రకటన తర్వాత దేశంలో పెద్ద ఎత్తు చర్చ నడుస్తోంది. జీఎస్టీ ఎలా తగ్గిస్తారు? వేటిపై తగ్గిస్తారని అంతా చర్చించుకుంటున్నారు. కేవలం రెండే శ్లాబులతో జీఎస్టీలో మార్పులు రాబోతున్నాయి. ఢిల్లీలో GST కౌన్సిల్తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరుపుతున్నారు. GST రేట్ల హేతుబద్ధీకరణతోపాటు కొన్ని స్లాబ్లు తగ్గించాలన్న ప్రతిపాదనలపై మంత్రుల బృందంతో చర్చిస్తున్నారు. ప్రస్తుత GSTలో ఉన్న నాలుగు స్లాబ్లను తొలగించి రెండే చేయాలని చూస్తున్నారు. 5, 18 శాతం స్లాబ్లు కొనసాగించాలని.. కొన్నింటిపై మాత్రమే 40 శాతం ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్తో కలిసి.. రాష్ట్ర ఆర్థికమంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుని.. చివరికి జీఎస్టీ సవరణలు చేయబోతోంది.
ఇప్పటివరకు ఉన్న 12, 28 శాతం పన్ను శ్లాబులు ఇకపై ఉండవు. ఈ శ్లాబుల్లో ఉన్న వస్తువులను మిగిలిన శ్లాబుల్లో కలుపుతారు. ఇప్పటివరకు ఈ శ్లాబుల్లో ఉన్న వాటిని ఏ స్లాబ్లకు మార్చాలో కసరత్తు చేస్తారు. పేద, మధ్యతరగతి, MSMEలు, వ్యవసాయ రంగానికి పన్ను భారాన్ని తగ్గించడం కోసం GSTలో సంస్కరణలు తెస్తున్నట్టు కేంద్రం చెప్తోంది. దీపావళి 2025 నాటికి, భారత ప్రభుత్వం జీఎస్టీలో ఈ మార్పులు తీసుకురానుంది. అయితే హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక రేటు ఉంటుంది. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న 99% వస్తువులు 5% శ్లాబులోకి మారుతాయి. 28% శ్లాబులో ఉన్న 90% వస్తువులు 18% శ్లాబులోకి మారుతాయి. GST చట్టం ప్రకారం పాన్మసాలా, పొగాకు, ఆన్లైన్ గేమింగ్ లాంటి డీమెరిట్ వస్తువులతో 40 శాతం పన్నుతో స్లాబ్ ఉంటుంది.
బియ్యం, గోధుమలు, పప్పులు, తాజా కూరగాయలు, పండ్లు 0% జీఎస్టీలో కొనసాగుతాయి. పాలు, పెరుగు, మజ్జిగ – పన్ను లేకుండానే లభిస్తాయి. బ్రాండెడ్ బియ్యం, గోధుమ పిండి, నెయ్యి వంటి ప్యాక్ చేయబడిన ఆహార వస్తువులపై జీఎస్టీ 5శాతానికి తగ్గుతుంది. ఆరోగ్యం, విద్య
ఆరోగ్య సంరక్షణ సేవలు పన్ను లేకుండా.. లేక చాలా తక్కువ రేటుతో లభిస్తాయి. ముఖ్యమైన ఔషదాలు చాలా వరకు 12% నుండి 5%కి లేక.. సున్నా రేటుకు మారతాయి. విద్యా సేవలు – జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతాయి. శానిటరీ నాప్కిన్లు 0% జీఎస్టీతో కొనసాగుతాయి. అన్ని దుస్తులు, వస్త్రాలు వాటి ధరతో సంబంధం లేకుండా ఒకే విధంగా 5% జీఎస్టీ ఉంటుంది. ప్రస్తుతం 1,000 లోపు వస్తువులకు 5%, 1,000 రూపాయల కంటే ఎక్కువ వస్తువులకు 12% జీఎస్టీ విధిస్తున్నారు. పత్తి, పట్టు నూలు, బట్టలు వంటి వస్త్ర పదార్థాలు 5% జీఎస్టీలో కొనసాగుతాయి. ఈ మార్పు వల్ల అన్ని వర్గాల వారికి దుస్తులు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇక మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై 18శాతం జీఎస్టీ విధిస్తారు.
జీఎస్టీ శ్లాబుల మార్పుతో టూత్పేస్ట్, సబ్బులు, షాంపూలు వంటి రోజువారీ వస్తువులకు ప్రయోజనాలు కలుగుతాయి. ప్యాక్ చేసిన ఆహార వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ ఉంటుంది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై – కొన్ని వస్తువులకు శాతానికి రేటు తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు 28% నుంచి 18శాతానికి రేటు తగ్గింపుతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రజా రవాణా నాన్- ఏసీ సేవలకు 5% మాత్రవే జీఎస్టీ ఉంటుంది. ఆటో రిక్షాలు, ట్యాక్సీలకు జీఎస్టీలో మార్పులేదు. పేదరికం దిగువన ఉన్న ప్రజల జీవనశైలిని మెరుగుపర్చేందుకు ఇవి తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
GST స్లాబ్లపై చర్చించే మంత్రుల బృందానికి కన్వీనర్గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ మంత్రులు కూడా GoMలో ఉన్నారు. మెరిట్, స్టాండర్డ్ కేటగిరీ కింద వస్తువులను వర్గీకరించి.. వీటన్నింటినీ 5శాతం, 18 శాతం కింద రెండు స్లాబ్లకు తీసుకురావడంపై కేంద్రం చేసిన ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారు.