
EPFO Interest Rates: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్దమవుతోంది. ఉద్యోగుల భద్రత కోసం ఇటీవల కొత్త కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం.. దాని ద్వారా అనేక సౌకర్యాలు కల్పించింది. కార్మిక కోడ్ల వల్ల ఉద్యోగులకు సకాలంలో జీతాలు, ఆరోగ్య భద్రత, పీఎఫ్ బెనిఫిట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గిగ్ కార్మికులతో పాటు ఏ రంగంలో పనిచేసివారికైనా ఆ రూల్స్ వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక సంస్కరణల్లో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఈపీఎఫ్వో వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని తెలుస్తోంది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 9 శాతంకు పెంచనుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోనప్పటికీ.. సూత్రపాయంగా కేంద్రం ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంసత్సరంతో పోలిస్తే ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. దీంతో ఈపీఎఫ్వో నుంచే వచ్చే ఈ సర్ప్రైజ్ న్యూస్ కోసం లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 9 శాతం వడ్డీ రేటును ఫిక్స్ చేస్తే.. దేశవ్యాప్తంగా 75 మిలియన్ల ఉద్యోగులు లాభపడనున్నారు.
గత ఆర్ధిక సంవత్సరంలో(2024-25) ఈపీఎఫ్ డబ్బులపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు దానికి 9 శాతానికి పెంచితే.. గత ఏడాది కంటే 0.75 శాతం ఎక్కువ పెంచినట్లు అవుతుంది. ఫిబ్రవరి కల్లా పెంపుపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. త్వరలో జరగనున్న ఈపీఎఫ్వో బోర్డ్ ట్రస్టీస్ మీటింగ్లో దీనిపై చర్చించి ఆమోదించనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే లక్షల మంది పీఎఫ్ ఉద్యోగులకు పండగగా చెప్పవచ్చు. వారి పీఎఫ్ సేవింగ్స్పై గతంలో కంటే ఎక్కువ వడ్డీ రానుంది.