
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు కొత్త ప్రాజెక్టులు ప్రకటించగా.. తెలంగాణలో కూడా నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణలో NH-63, NH-563లోని వివిధ సెక్షన్లను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకోసం రూ.7,597 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులకు ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం రూ.39,290 కోట్ల పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం ఆరు ముఖ్యమైన ప్రతిపాదనలను ఈ సమావేశంలో ఆమోదించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆమోదించింది. రామేశ్వరం-కోణార్క్-పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్ట్ను ఆమోదించగా.. ఇందుకు రూ.8,301 కోట్లు ఖర్చు చేయనుంది. దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో అనుసంధానాన్ని ఈ ప్రాజెక్ట్ బలోపేతం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. ఇక బీహార్లోని ఖగారియా-పూర్నియా సెక్షన్ను నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు రూ.3,936 కోట్లు ఆమోదించారు. మధ్యప్రదేశ్లో NH-347B అప్గ్రేడ్ కోసం రూ.4,415 కోట్ల పెట్టుబడిని కూడా ఆమోదించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వాహనాల కొనుగోలుపై 100 శాతం మోటారు వాహన పన్ను మినహాయింపు రిజిస్ట్రేషన్ ఫీజులో ఉపశమనాన్ని కూడా అందిస్తాయి. అయితే ఈ ప్రయోజనం తమ పాత వాహనాలను స్క్రాప్ చేసే లేదా వాటిని NCAP యేతర నగరాలకు తరలించే వాహన యజమానులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.