ఇన్సూరెన్స్‌ తీసుకొని బ్యాంక్‌ అధికారులు ఎందుకు వేధిస్తారు? బయటపడ్డ సంచలన నిజాలు!

భారతదేశంలో బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను దూకుడుగా విక్రయిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సర్వేల ప్రకారం, బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్లు విక్రయ లక్ష్యాల ఒత్తిడితో కస్టమర్లకు బీమా, పెట్టుబడి పథకాలను అందిస్తున్నారు. చాలా మంది కస్టమర్లు బ్యాంకుపై నమ్మకంతో వీటిని తీసుకుని, తరువాత తక్కువ రాబడి, క్లిష్టమైన షరతులు తెలుసుకుంటున్నారు.

ఇన్సూరెన్స్‌ తీసుకొని బ్యాంక్‌ అధికారులు ఎందుకు వేధిస్తారు? బయటపడ్డ సంచలన నిజాలు!
Bancassurance In India

Updated on: Mar 10, 2026 | 8:00 AM

భారతదేశంలో బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉత్పత్తుల విక్రయంపై తాజాగా వెలువడిన పరిశ్రమ డేటా ఆందోళన కలిగించే విషయాలను బయటపెట్టింది. ఒక సర్వే ప్రకారం.. 57 శాతం కంటే ఎక్కువ మంది బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్లు ఆర్థిక ఉత్పత్తులను ఏ ధరకైనా విక్రయించమని తమ పైఅధికారులు ఒత్తిడి తెస్తున్నారని అంగీకరించారు. దీంతో సాధారణ బ్యాంకింగ్ సేవల కోసం వచ్చిన కస్టమర్లకు బీమా లేదా పెట్టుబడి పథకాలు దూకుడుగా సూచించే పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణంగా ఒక కస్టమర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పునరుద్ధరించేందుకు బ్యాంకు శాఖకు వెళ్తే, అతనికి బదులుగా అధిక రాబడి, పన్ను ప్రయోజనాలు ఉంటాయని చెప్పి దీర్ఘకాలిక పెట్టుబడి లేదా బీమా పథకాలను సూచించే ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకుపై ఉన్న నమ్మకంతో చాలా మంది కస్టమర్లు వెంటనే ఆ పథకాలకు సైన్‌ చేస్తారు. కానీ తరువాత అవి దీర్ఘకాల లాక్-ఇన్‌, క్లిష్టమైన షరతులు, తక్కువ రాబడితో ఉండొచ్చని తెలుసుకుంటారు.

బ్యాంకు ఉద్యోగులపై ఉన్న ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో ఒక సర్వే వెల్లడించింది. 15 రాష్ట్రాల్లోని 20 బ్యాంకుల్లో పనిచేస్తున్న 1,655 మంది రిలేషన్‌షిప్ మేనేజర్లపై నిర్వహించిన అధ్యయనంలో 84 శాతం మంది అమ్మకాల లక్ష్యాల కోసం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని చెప్పారు. అలాగే సుమారు 51 శాతం మంది లక్ష్యాలను చేరుకోలేకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఉత్పత్తులను విక్రయించే చాలా మంది ఉద్యోగులకు వాటి గురించి పూర్తి అవగాహన ఉండకపోవడం. సర్వే ప్రకారం 85 శాతం మంది మ్యూచువల్ ఫండ్‌లలో డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ మధ్య తేడా తెలియదని చెప్పారు. అలాగే 75 శాతం మంది ELSS పన్ను ప్రయోజనాల గురించి తెలియదని, 98 శాతం మంది నామమాత్రపు, వాస్తవ రాబడుల మధ్య తేడాను గుర్తించలేమని తెలిపారు.

ఇదిలా ఉండగా బ్యాంకులు మాత్రం ఈ ఉత్పత్తుల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో టాప్ 15 బ్యాంకులు బీమా, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా సుమారు రూ.21,773 కోట్ల కమిషన్ ఆదాయం పొందాయి. ఈ వ్యవస్థను “బ్యాంకాస్యూరెన్స్” అని పిలుస్తారు, ఇందులో బ్యాంకులు బీమా కంపెనీలకు ప్రధాన పంపిణీ భాగస్వాములుగా పనిచేస్తాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితుల్లో కస్టమర్లు ఏ ఆర్థిక ఉత్పత్తి తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అత్యంత అవసరం. బ్యాంకు సూచించిన పథకం నిజంగా తమ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందా లేదా కేవలం అమ్మకాల లక్ష్యాల కోసం సూచిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us