
బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే సమయంలోనే దరఖాస్తులో నామినీ వివరాలు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక నామినీ పేరును మనం పెడతాం. అయితే ఇకపై నలుగురు వరకూ నామినీలను నియమించుకునే అవకాశం కేంద్రం ప్రభుత్వం కల్పిస్తోంది. అందుకో సం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును గత ఏడాది డిసెంబర్లో లోక్ సభ ఆమోదించగా.. రాజ్యసభ గత బుధవారం ఆమోదం తెలిపింది. కేవలం నగదు డిపాజిట్లలోనే కాక ఫిక్స్ డ్ డిపాజిట్లు, లాకర్లు, బీమా పాలసీలు, మరే ఇతర ఆర్థిక సాధనాల్లో అయినా ఇదే విధానం అమలు అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
బహుళ నామినీలను అనుమతించడం వల్ల డిపాజిటర్లకు ఎక్కువ సౌలభ్యం, భద్రత, క్రమబద్ధమైన ఆస్తి బదిలీ ప్రక్రియ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఖాతాదారుడి మరణం తరువాత, నామినీ సంరక్షకుడిగా వ్యవహరిస్తాడు, నిధుల బదిలీ సజావుగా జరగడానికి ఇది దోహదపడుతుంది. అయితే, నామినీ అంతిమ లబ్ధిదారుడు కాదు. బ్యాంకు నుంచి ఖాతా కస్టడీని స్వీకరించడానికి అధికారం ఉన్న వ్యక్తి అని గమనించడం చాలా ముఖ్యం. వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తులను నిజమైన వారసులకు పంపిణీ చేయడానికి నామినీ బాధ్యత వహిస్తాడు. ఈ సవరణ బ్యాంకులపై పరిపాలనా భారాన్ని తగ్గించడమే కాకుండా ఖాతాదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.
ఈ కొత్త నామినేషన్ విధానం వల్ల క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోవడం అనే సమస్య ఉత్పన్నం కాదు. 2023 మార్చిలో రూ.62,225 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు మార్చి 2024 నాటికి రూ.78,213 కోట్లకు 26 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక వెల్లడించింది. బహుళ నామినీలను అనుమతించడం ద్వారా, ఖాతాదారులు తమ నిధులను వారి ఇష్టానుసారం పంపిణీ చేయవచ్చు, తద్వారా డిపాజిట్లు క్లెయిమ్ చేయబడకుండా పోయే అవకాశం తగ్గుతుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తుందని.. అలాగే కస్టమర్లకు అదనపు రక్షణను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి