
ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునే సమయంలో మెషీన్ నగదు ఇవ్వకపోయినా ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయిన సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇలాంటి ఘటనలో ఒక వ్యక్తి ఎనిమిదేళ్ల న్యాయపోరాటం తర్వాత న్యాయం పొందాడు. బ్యాంక్ డబ్బును తిరిగి ఇవ్వడంతో పాటు అదనంగా పరిహారం చెల్లించాల్సిందిగా వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఈ ఘటన 2018 ఆగస్టులో జరిగింది. ఫిర్యాదుదారుడు యాక్సిస్ బ్యాంక్ కు చెందిన ఏటీఎం నుంచి రూ.5,000 విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాడు. లావాదేవీ పూర్తయిందని మెషీన్ చూపించినప్పటికీ, నగదు మాత్రం బయటకు రాలేదు. అదే సమయంలో అతని మొబైల్కు ఖాతా నుంచి రూ.5,000 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
ఈ సమస్యపై అతను వెంటనే బ్యాంకును సంప్రదించి తన కంప్లైంట్ నమోదు చేశాడు. అయితే బ్యాంక్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని అతను పేర్కొన్నాడు. తరువాత అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వద్ద కూడా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అతనికి సరైన పరిష్కారం లభించలేదు. దీంతో చివరకు అతను నాగ్పూర్ జిల్లా కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ ను ఆశ్రయించాడు. కమిషన్ ముందు కేసు విచారణకు వచ్చినప్పటికీ, చట్టపరమైన నోటీస్ ఇచ్చినప్పటికీ బ్యాంక్ ప్రతినిధులు హాజరు కాలేదు. దీంతో కమిషన్ వన్ సైడ్ గా విచారణ కొనసాగించింది.
విచారణలో భాగంగా ఏటీఎం సీసీటీవీ రికార్డింగ్ లను పరిశీలించకపోవడం, సరైన ఇన్వెస్టిగేషన్ జరపకపోవడం వంటి అంశాలను కమిషన్ తీవ్రమైన నిర్లక్ష్యంగా పేర్కొంది. మెషీన్ నగదు ఇవ్వకపోయినా ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయినప్పుడు వెంటనే దర్యాప్తు చేసి కస్టమర్కు సహాయం చేయాల్సిన బాధ్యత బ్యాంకుదేనని స్పష్టం చేసింది. చివరగా కమిషన్ కస్టమర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఫిర్యాదుదారుడి ఖాతా నుంచి డెబిట్ అయిన రూ.5,000ను వెంటనే తిరిగి చెల్లించాలని బ్యాంక్ను ఆదేశించింది. అలాగే ఎనిమిదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక, శారీరక ఇబ్బందులకు పరిహారంగా అదనంగా రూ.10,000 చెల్లించాలని కూడా ఆదేశించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి