పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోదీ లండన్లో దర్శనమిచ్చాడు. ఖరీదైన కోటు(దాదాపు 7లక్షలు) ధరించి లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న నీరవ్ మోదీని బ్రిటీష్ న్యూస్పేపర్ ద టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తించి పలు ప్రశ్నలు సంధించాడు. అన్నింటికి నో కామెంట్ అంటూ సమాధానం ఇస్తూ అక్కడి నుంచి తప్పించుకొని క్యాబ్లో ఎక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ద టెలిగ్రాఫ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Exclusive: Telegraph journalists tracked down Nirav Modi, the billionaire diamond tycoon who is a suspect for the biggest banking fraud in India’s historyhttps://t.co/PpsjGeFEsy pic.twitter.com/v3dN5NotzQ
— The Telegraph (@Telegraph) March 8, 2019
లండన్లోని సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్ ఉంటున్నాడు. దీని అద్దె దాదాపు రూ.15లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. అక్కడికి దగ్గరలోని సోహోలో నీరవ్ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు ద టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. మామూలుగా లండన్లో వ్యాపారం చేయాలంటే నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ తప్పనిసరి. అలాంటిది భారత్లో వేల కోట్ల మోసం చేసి లండన్కు పారిపోయి వచ్చిన వ్యక్తికి నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ ఎలా వచ్చిందని ఆ పాత్రికేయుడు వీడియోలో ప్రశ్నించాడు. కాగా భారత్లోని రాయిగఢ్లో సముద్రపు ఒడ్డున ఉన్న నీరవ్ మోదీ ఇంటిని శుక్రవారం అధికారులు డైనమెట్లతో పేల్చేసిన విషయం తెలిసిందే.