లాక్ డౌన్‌పై జగన్ ద్విముఖ వ్యూహం

|

Apr 10, 2020 | 6:13 PM

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా లేక పాక్షికంగా ఎత్తివేయాలా అనే అంశం మీద శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్న తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంతో ద్విముఖ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్‌పై జగన్ ద్విముఖ వ్యూహం
Follow us on

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా లేక పాక్షికంగా ఎత్తివేయాలా అనే అంశం మీద శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్న తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంతో ద్విముఖ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది.

వచ్చే 24 గంటలు లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో అత్యంత కీలకమైన తరుణంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా వుండాలనే విషయంపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలు, అక్కడ అనురిస్తున్న విధానాలపై సీఎంకు అధికారులు వివరించారు.

ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై చర్చ జరిగింది. వీలైనన్ని కరోనా పరీక్షలు చేయడంద్వారా వైరస్‌ సోకిన వారిని గుర్తించడం, వారి ప్రైమరీ కాంటాక్టులను ట్రేస్‌ చేయడం ద్వారా వారికి వైద్యాన్ని అందించాలన్న స్ట్రాటజీ ప్రకారం ముందుకు సాగుతున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి సూచించారు. తద్వారానే కరోనా లాంటి వైరస్‌లు, ఇతర వ్యాధులను అడ్డుకోగలమని చెప్పిన సీఎం ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రజారోగ్యంపై దాడిచేస్తున్న ఇలాంటి వైరస్‌లను, వ్యాధులను అరికట్టేందుకు భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఎలా సిద్ధం కావాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బందికి వెంటిలేటర్ల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఉండాలని, సరిపడా వైద్యులు, వైద్య సిబ్బందిని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఇదివరకే ప్రతిపాదించిన విధంగా కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

లాక్ డౌన్ ఎత్తివేస్తే.. అమల్లోకి వచ్చే సడలింపుల ద్వారా కరోనా వ్యాపించకుండా ప్రత్యామ్నాయాలు సిద్దం చేయాలని, దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్ళాలని సీఎం అధికార యంత్రాంగానికి సూచించారు.