భరతమాత ముద్దు బిడ్డ అభినందన్ వర్ధమాన్ భారత గడ్డపై అడుగు పెట్టారు. ఎయిర్వేస్ మార్షల్స్ ప్రభాకరన్, ఆర్జీకే కపూర్లు ఆయనకు సాదర స్వాగతం పలికారు. గత కొన్ని గంటలుగా ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. అటారీ -వాఘా సరిహద్దుల్లో అభినందన్ను పాక్ భారత్కు అప్పగించింది.
దీంతో భారత్ అబిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభినందన్ను అప్పగిస్తున్న వాఘా బోర్డర్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని సంతోషంతో సరిహద్దు దద్దరిల్లేలా భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
ఘనస్వాగతం..
భారత ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు వాఘా బోర్డర్ వద్ద భారత్కు అప్పగించేందుకు పాక్ సిద్ధమవ్వగా ఆ బోర్డర్ ప్రాంతానికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జాతీయ జెండాలు చేతబూని భారత మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. భారత్ వైపు ప్రజలు భారీగా ఉండటంతో ఇండియన్ ఆర్మీ తగిన చర్యలు కూడా తీసుకుంది.
అభినందన్ను పాక్ ఎలా తీసుకొచ్చింది
అభినందన్ను భారత్కు అప్పగించే విషయంలో పాకిస్తాన్ చాలా కష్టపడింది. భారత్కు అప్పగిస్తామని మాట ఇచ్చిన నేపథ్యంలో సురక్షితంగా అప్పగించేందుకు గట్టి చర్యలు తీసుకుంది. అభినందన్ ఉన్న వాహనానికి ముందూ వెనక నావల్ బేస్ వాహనాలు ఉన్నాయి. గట్టి భద్రతతో అభినందన్ను వాఘా బోర్డర్కు తీసుకురావడానికి పెద్ద కారణమే ఉంది. అభినందన్ను అప్పగించడం ఇష్టం లేని ఉగ్రవాదులు, ఐఎస్ఐ ఏదైనా దాడి చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన పాక్ ఈ విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన భద్రత మధ్య అభినందన్ను లాహోర్ నుంచి వాఘా బోర్డర్కు తీసుకొచ్చింది.
వాఘా బోర్డర్కు రాగానే ఏం జరగుతుంది?
అభినందన్ను వాగా బోర్డర్ వద్దకు తీసుకురాగానే నేరుగా భారత్కు అప్పగించేస్తారా? అంటే లేదు. ముందుగా భారత ఆర్మీ అధికారులతో పాక్ ఆర్మీ చర్చలు జరుపింది. అప్పగింతకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుని పత్రాలు మార్చుకున్నారు. ఆ తర్వాతనే అభినందన్ను భారత్కు అప్పగించారు. అభినందన్కు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే భారత్ స్వీకరించింది.
మరి అభినందన్ను అప్పగించిన వెంటనే ఏం చేశారు?
భారత అదికారులకు అభినందన్ను అప్పగించగానే ముందుగా అభినందన్కు వైద్య పరీక్షలు చేశారు. ఇందుకు అంబులెన్స్లు ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. పాకిస్తాన్ ముందుగానే వైద్య పరీక్షలు చేసి ఒక సర్టిఫికేట్ను భారత్కు అప్పగిస్తుంది. ఆ రిపోర్ట్కు మన వైద్యులు చేసిన రిపోర్ట్ సరితూగుతుందా లేదా అనేది చూశారు. బోర్డర్లో వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అభినందన్ను ఢిల్లీకి తరలించారు.
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ
పాక్ నుంచి భారత్కు అభినందన్ను పంపేందుకు జరగాల్సిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పాక్ పూర్తి చేసింది. ఇందుకు సింగిల్ పేజీ వీసాను అభినందన్కు జారీ చేసింది. దీంతో అధికారికంగా సరిహద్దును దాటేందుకు పాక్ నుంచి అనుమతి ఇచ్చినట్టు అయ్యింది.
అభినందన్ను అంతసేపు ఎందుకు వెయిట్ చేయించారు?
అభినందన్ను నాలుగు గంటల ప్రాంతంలో తీసుకొచ్చిన పాకిస్తాన్ భారత్కు అప్పగించేందుకు చాలా సమయం తీసుకుంది. తీసుకొచ్చిన వెంటనే అప్పగించలేదు. అయితే భారత వైపు నుంచి కూడా అధికారులు ఎక్కువ సమయమే తీసుకున్నారు. అందుకు కారణం ఏదైనా తేడా ఉంటే ఆన్ ది స్పాట్లోనే ప్రశ్నించి పరిష్కరించేందుకే ఎక్కువ సమయం తీసుకున్నారు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్కు రెడ్ క్రాస్ వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు కూడా జరిగాయి.
కావాలనే పాక్ హడావుడి
ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే అభినందన్ను అప్పగించేందుకు పాకిస్తాన్ ఉద్దేశ్యపూర్వకంగా ఎక్కువ సమయం తీసుకుందనే వాదనలు వినిపించాయి. ప్రపంచ మీడియా మొత్తం అక్కడకు చేరుకోగా తాము శాంతి కోసం చేసిన పనిగా ప్రపంచానికి చూపించేందుకు పాక్ ప్రాధాన్యతనిచ్చింది. ఈ కుయుక్తిలో భాగంగానే భారత్ విమానాన్ని పంపిస్తామన్నా అందుకు నిరాకరించింది.
భారత భూభాగంలోకి చొరబడ్డ పాక్ యుద్ధవిమానాలను వెంబడించిన అభినందన్ అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చేశారు. ఈ సందర్భంగా తన మిగ్-21 విమానం దెబ్బతినడంతో పాక్ భూభాగంలో పారాచూట్ సహాయంతో దిగారు. దీంతో పాక్ సైన్యం ఆయన్ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
చివరి వరకు హైడ్రామా
మొదట మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో అభినందన్ను విడుదల చేస్తారని భావించినా..పాక్ అధికారులు కావాలనే జాప్యం చేశారు. డాక్యుమెంటేషన్ పేరుతో అప్పగింత ప్రక్రియను లేట్ చేశారు. ఎట్టకేలకు 9 గంటల 19 నిమిషాలకు బార్డర్లో పత్రాల సమర్పణ అనంతరం పాకిస్థాన్ భుభాగం నుంచి భారత భూభాగంలోకి గర్వంగా అడుగుపెట్టాడు అభినందన్.