Big News Big Debate: బద్వేలు ప్రీమియర్‌ లీగ్‌ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు

బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. స్థానిక పోలీసులపై నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసింది బీజేపీ.

Big News Big Debate: బద్వేలు ప్రీమియర్‌ లీగ్‌ - BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు
Big News Big Debate

Updated on: Oct 26, 2021 | 8:29 PM

Big News Big Debate: బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. స్థానిక పోలీసులపై నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసింది బీజేపీ. ప్రత్యేకహోదా ఇవ్వండి పోటీ లోంచి తప్పుకుంటామని సవాల్ విసిరింది YCP. రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం BJP, YCP లేనని వాటిని ఓడించాలని పిలుపు ఇచ్చింది కాంగ్రెస్. బద్వేలు బైపోల్‌లో సవాళ్లు.. ప్రతిసవాళ్లతో రాజకీయం రచ్చరచ్చగా మారుతోంది. ఏకపక్షంగా ఉంటుందని భావించిన బద్వేలులో పోటీ ఎందుకింత రసవత్తరంగా మారింది. నిజంగానే కమలనాథులకు పోటీలో లేని పార్టీల రహస్య మద్దతు లభిస్తుందా.?

గెలుపు పక్కా. మెజారిటీయే లెక్క అంటోంది వైసీపీ. వైసీపీది అధికార దుర్వినియోగమంటోంది బీజేపీ. ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరుగులేని మెజార్టీతో విజయాలు సాధిస్తున్న YCPకి బద్వేలు ఫలితం కూడా ఏకపక్షంగా వస్తుందని ధీమా. అయితే అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నామని గెలుపు మాదే అంటూ సీమలో సవాళ్లు చేస్తున్నారు కమలనాథులు. హెమాహెమీలను ప్రచారబరిలోనూ దింపుతోంది కాషాయం. ఇక మంత్రి పెద్దిరెడ్డి సారధ్యంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి మరీ మెజార్టీపై ఫోకస్‌ పెట్టారు.

విభజన హామీలపై BJPని నిలదీస్తోంది వైసీపీ. పోర్టులు, కడప స్టీల్‌ పరిశ్రమల సంగతేంటని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. అవినీతిలో కూరుకుపోయిన YCP MLAలు, మంత్రులకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడుందని ఎదురుదాడి చేస్తోంది BJP. వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధం ఎలా ఉన్నా.. ఇక్కడ మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. బీజేపీ నేతలు వారి SELF SATISFACTION‌ కోసమే ఏదేదో మాట్లాడుతున్నారని.. బీజేపీని ముందు పెట్టి మిగిలిన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు MLA రోజా. బద్వేల్‌ ఉప ఎన్నికల్లో దొంగలంతా ఏకమయ్యారని కూడా విమర్శించారు.

వైసీపీ ఆరోపణలు సంగతి అటు పెడితే బీజేపీ వ్యూహం కూడా అదే అనిపిస్తోంది. టీడీపీ పోటీలో లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తమకే పడుతుందన్న బావన కమలనాథుల్లో ఉంది. జనసేన ఎలాగూ మిత్రపక్షమే. బహిరంగంగా అంగీకరించకపోయినా.. అంతర్గంగా మాత్రం టీడీపీ మద్దతు ఉందని కేడర్‌ అంటోంది. అలా కలిసివచ్చే ఓట్లతో తమ బలంగా చూపించుకోవాలని భావిస్తోంది. ముందు లైట్‌గా తీసుకున్నా వ్యూహం మార్చి ప్రచారంలో దూకుడు పెంచింది. హెమాహెమీలను రంగంలో దింపుతోంది. అగ్రనాయకులు నియోజకవర్గంలో మకాం వేసి మరీ వ్యూహాలు రచిస్తున్నారు. EC వద్ద ఫిర్యాదు చేసి మరీ 15 పారా మిలటరీ బలగాల సమక్షంలో ఎన్నికలు జరిగేలా చేసింది. సీసీ కెమెరాలు పెట్టించడం.. ఎన్నికల అబ్జర్వర్‌ వచ్చేలా చేయడంలో కమలనాథులు సఫలమయ్యారు. ఏకపక్షంగా సాగుతుందన్న ప్రచారం మధ్య బీజేపీ హీట్‌ అయితే జనరేట్‌ చేయగలిగింది.

అటు గతంలో బీజేపీ కంటే ఎక్కువ ఓట్లే సంపాదించిన కాంగ్రెస్‌ పార్టీకి కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. టీడీపీ పోటీలో లేకపోవడం.. అధికారపార్టీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సీపీఐ కాంగ్రెస్‌కే తమ ఓటు అంటోంది. మొత్తానికి వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ హడావిడి చేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు అక్కడే మకాం వేశారు. మరి బద్వేల్ ప్రీమియర్‌ లీగ్‌లో ఎవరి సత్తా ఏంటో నవంబర్‌ 2న తేలనుంది.                                     (బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us