Andhra: వాయమ్మో.. 30 అడుగుల బావిలో పడిన మహిళ.. బయటకు ఎలా వచ్చిందంటే..

ఏలూరు జిల్లా నూజివీడు బొందిలిపేటలో 30 అడుగుల లోతైన బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన మహిళను పోలీసులు, స్థానికుల సహకారంతో సురక్షితంగా బయటకు తీశారు. జిల్లా శైలజ అనే మహిళ ఇంటి ముందు ఉన్న బావి వద్దకు వెళ్లిన సమయంలో అదుపుతప్పి బావిలో పడిపోగా, ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Andhra: వాయమ్మో.. 30 అడుగుల బావిలో పడిన మహిళ.. బయటకు ఎలా వచ్చిందంటే..
Woman Falls Into 30 Foot Well

Edited By:

Updated on: Jul 17, 2026 | 9:23 AM

ఏలూరు : ఊరులోని జనాలంతా ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉండగా.. ఒక పెద్ద అరుపు అందరిని ఉలిక్కి పడేలా చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆర్తనాదం అని అందరూ దిక్కులు చూసారు. ఆ కేకలు వినిపిస్తున్న వైపుకు అందరూ పరుగులు తీసారు. బావిలో ఒక మహిళా పడి పోయింది. కాపాడమంటూ కేకలు పెడుతోంది. ఈ ఘటన నూజివీడు బొందిలిపేట వీధిలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన జిల్లా శైలజ అనే మహిళ తన ఇంటి ముందే ఉన్న బావి వద్దకు వెళ్లిన తరుణంలో, అదుపుతప్పి ఒక్కసారిగా 30 అడుగుల లోతు ఉన్న చీకటి బావిలోకి ఆమె పడిపోయింది. వెంటనే ఆమె ప్రాణభయంతో కేకలు పెట్టింది. బావిలో నుండి వస్తున్న ఆమె కేకలతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సరిగ్గా అదే సమయంలో, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అప్రమత్తమయ్యారు.

క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయే అవకాసం ఉండటంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. 30 అడుగుల లోతు, ఊపిరాడని పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది. కానీ పోలీసు అత్యంత చాకచక్యంగా రక్షణ చర్యలు అమలు చేశారు. ఫోన్ కాల్ వచ్చిన అతి తక్కువ సమయంలోనే, మృత్యువుతో పోరాడుతున్న ఆ మహిళను రక్షించేందుకు స్థానికుల సహకారంతో కాలంతో పోటీ పడ్డారు. శ్వాస బిగపట్టి చూస్తున్న జనసందోహం మధ్య, పక్కా ప్రణాళికతో బావిలోకి దిగి, చివరకు ఆ మృత్యు కూపం నుండి శైలజను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

Eluru Well Incident

ఆమె క్షేమంగా బావి పైకి రాగానే, ఆమె బంధువులతో పాటు అక్కడ చేరిన వారి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. అంతటి ఘోర ప్రమాదం జరిగినా, ఒంటిపై చిన్న గీత కూడా పడకుండా శైలజ సురక్షితంగా బయటపడటం చర్చనీయాంశంగా మారింది. చావు అంచుల దాకా వెళ్లిన ప్రాణాన్ని, సమయస్ఫూర్తితో వ్యవహరించి నిమిషాల వ్యవధిలో కాపాడిన టౌన్ ఎస్సై నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, చొరవ చూపిన మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణల ను పలువురు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us