అయ్యో.. ఎంత విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కన్నుమూత.. గంటల వ్యవధిలోనే..!

Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం కలిసి జీవించిన వృద్ధ దంపతులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వంగపండు వెంకటస్వామి (80) మృతిని తట్టుకోలేక ఆయన భార్య అప్పలనరసమ్మ (72) కూడా కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయ్యో.. ఎంత విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కన్నుమూత.. గంటల వ్యవధిలోనే..!
Elderly Couple Death

Edited By:

Updated on: May 27, 2026 | 11:21 AM

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా జీవించిన వృద్ధ దంపతులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన వంగపండు వెంకటస్వామి (80), ఆయన భార్య అప్పలనరసమ్మ (72) మరణం స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.
అప్పలనరసమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే సమయంలో ఆమె భర్త వెంకటస్వామి కూడా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో వెంకటస్వామి ఇంట్లోనే కన్నుమూశాడు. ఈ విషయం ఆసుపత్రిలో ఉన్న అప్పలనరసమ్మకు తెలియజేయగా ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. జీవితాంతం తనకు అండగా నిలిచిన భర్త ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేక భోరున విలపించింది.

భర్తను చివరిసారిగా చూసేందుకు ఆసుపత్రి నుంచి గ్రామానికి బయలుదేరిన అప్పలనరసమ్మ, మార్గమధ్యంలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. బొబ్బిలి సమీపంలోని అప్పయ్యపేట వద్దకు చేరుకునే సరికి ఆమె ప్రాణాలు విడిచింది. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు తవిటినాయుడు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయిన ఈ పండుటాకుల మరణం గ్రామ ప్రజల హృదయాలను కదిలించింది.

Follow Us