గోమాతకు ప్రత్యేక అలంకరణ.. గాజులు, చీర కట్టించి పూజలు! దీని వెనుక ఉన్న సంప్రదాయం తెలుసా?

Cow Puja: హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోమాతకు చీర, గాజులు, ప్రత్యేక అలంకరణ చేసి ఎంతో ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి గ్రామంలో గోస్తనీ నది తీరాన ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.

గోమాతకు ప్రత్యేక అలంకరణ.. గాజులు, చీర కట్టించి పూజలు! దీని వెనుక ఉన్న సంప్రదాయం తెలుసా?
Cow Puja

Edited By:

Updated on: Mar 26, 2026 | 9:53 PM

విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి గ్రామంలో గోస్తనీ నది తీరాన ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. సాధారణంగా మనుషులకే నిర్వహించే సీమంతం కార్యక్రమాన్ని ఇక్కడ గోమాతకు ఘనంగా నిర్వహించడం విశేషంగా మారింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవుపై తమ భక్తి, ప్రేమను చాటుకున్నారు. ఈ గోమాతను గతంలో ఆలయ పూజారి వడలి విశ్వనాథంకు భక్తులు దానం చేశారు. అప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తుల నిత్యపూజలలో ఈ ఆవుకు ప్రత్యేక స్థానం ఉంది. గోమాత సంరక్షణ కోసం భక్తులంతా కలిసి ఒక గోశాలను కూడా నిర్మించారు.

సీమంతం సందర్భంగా అర్చకుడు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమతో గోమాతను అలంకరించి, చీర కట్టించి మంగళహారతులు ఇచ్చారు. గాజులు, మిఠాయిలు, పండ్లు సమర్పించి ఆవుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఆచారంగా కాకుండా, గోమాత పట్ల ఉన్న గౌరవం, భారతీయ సంస్కృతిలో ఆవుకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెప్తుంది. గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం చూసిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామంలో ఇలాంటి సంప్రదాయాలు మరిన్ని కొనసాగాలని ఆకాంక్షించారు. భీమసింగి గ్రామంలో జరిగిన ఈ గోమాత సీమంతం కార్యక్రమం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా మారింది. ఇక్కడ జరిగిన ఈ సీమంతం కార్యక్రమం జిల్లాలో ఆసక్తిగా మారింది.

Follow Us