Vizag: మనుషులు ఏమో తేడాగా ఉన్నారు.. ఫెర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం అదిరిపోయింది.. డౌట్ వచ్చి.. బ్యాగులు వెతగ్గా
కంత్రీ గాళ్లు ఖతర్నాక్ స్కెచ్ వేశారు. ప్లాన్ను బాగానే అమలు చేశారు. కానీ ఖాకీలు ఏమన్నా తక్కువ తిన్నారా..? ఇప్పుడు వారు కూడా అప్డేట్ అయ్యారు. దీంతో కిలాడీల ఆటలు సాగలేదు.
గంజాయి స్మగ్లర్లు రోజుకో స్టైల్లో తమ పనిని కానిచ్చేస్తున్నారు. సరకు రవాణా సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. గంజాయి ప్యాకింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్న స్మగ్లర్లు.. వాసన బయటికి రాకుండా సువాసనలు వెదజల్లే ద్రవాన్ని చల్లుతున్నారు. తాజాగా రైల్వే స్టేషన్ ఎదుట పట్టుబడిన రాజస్థానీ ముఠా వ్యవహారం పోలీసులకి అవాక్కయ్యేలా చేసింది. విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు అంతకన్నా ఘటికులు. స్మగ్లర్ల ఎత్తును పసిగట్టి వారిని కటకటాల వెనక నెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి రాజస్థాన్ తదితర ప్రాంతాలకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాజస్థాన్కు చెందిన ఎండీ షరీఫ్ , షారూఖ్ ఖాన్, ఇన్సాఫ్ ఖాన్ ముఠాగా ఏర్పడి… గంజాయ్ రవాణా చేస్తున్నారు. బరంపురంలో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసుకొని.. గంజాయి వాసన బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బరంపురం నుంచి రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తుంటారు. ఈ సమాచారం అందుకున్న విశాఖ పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, ఎస్బీ అదనపు ఎస్పీ గంగాధరం ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు బృందం అప్రమత్తమైంది.
విశాఖ రైల్వేస్టేషన్లోని కార్ పార్కింగ్ ప్రాంతంలో గేట్`2 వద్ద అపరిచిత వ్యక్తులు గంజాయితో తచ్చాడుతున్నట్టు సీటీఎఫ్ సిబ్బంది గుర్తించారు. అధికారుల సూచనలతో మాటువేసి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 45కేజీల గంజాయితో పాటు 8వేల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కోసం ఫోర్త్ టౌన్ పోలీసులకు అప్పగించారు. గంజాయి ప్యాకింగ్ విషయంలో వీరు తీసుకున్న శ్రద్ధ చూసి పోలీసుల అవాక్కయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..