Visakha Railway Zone: మరో విభజన హామీకి కేంద్రం స్వస్తి.. మళ్లీ ఉద్యమ బాట పడతామంటున్న ఉత్తరాంధ్ర వాసులు

Visakha Railway Zone: 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన తూచ్చేనా..? ఆంధ్రప్రదేశ్ విషయంలో..

Visakha Railway Zone: మరో విభజన హామీకి కేంద్రం స్వస్తి.. మళ్లీ ఉద్యమ బాట పడతామంటున్న ఉత్తరాంధ్ర వాసులు
Visakha Railway Zone

Updated on: Dec 09, 2021 | 9:24 PM

Visakha Railway Zone: 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన తూచ్చేనా..? ఆంధ్రప్రదేశ్ విషయంలో మరో విభజన హామీకి కేంద్రం స్వస్తి పలికినట్లేనా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటనతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇక లేనట్లే అనేది తేలిపోయిందంటున్నారు. అయితే కేంద్రమంత్రి వైష్ణవ్ ప్రకటనపై ఉత్తరాంధ్ర వాసులు మాత్రం భగ్గుమ౦టున్నారు. రైల్వే జోన్ సాధన కోసం మళ్లీ ఉద్యమ బాట పడతామంటున్నారు.

మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నారు ఓ మహాకవి. అది రైల్వే శాఖ పనితీరుకు పూర్తి నిదర్శనమనే చెప్పొచ్చు. 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో ఎన్నికల ప్రచారంలో ఏపీకి రైల్వే జోన్ కేంద్రం ఇస్తున్న కానుక అని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రకటించారు. కొత్త జోన్ ఏర్పాటు పనులను పర్యవేక్షించేందుకు ఒక అధికారి (ఓఎస్‌డీ) ని కూడా నియమించింది. ఆయన విశాఖ కేంద్రంలో పనిచేసారు. రాయగడ, విజయవాడ, విశాఖపట్నాలలో ఉద్యోగుల విభజన, జోన్‌ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పరిపాలన విషయాలు, ఇతర అభ్యంతరాలు, ఈ జోన్‌కు వచ్చే ఉద్యోగుల వివరాలను సేకరించి 2019 ఆగస్టులో దీనిపై కేంద్రానికి నివేదిక పంపారు ఓఎస్‌డీ. అయితే ఆ తర్వాత నుంచి రైల్వే జోన్కు సంబంధించి అంతకు మించి ఏ పనీ ముందుకు వెళ్లలేదు. ఓఎస్‌డీ పంపిన నివేదికలపై ఇంకా ప్రభుత్వం స్పందించలేదు.2019లో కేంద్రం ప్రకటనతో ఆందోళనలు ఆగిపోయాయి. జోన్ ఇచ్చినా ఉత్తరాంధ్రకు ఫలితం లేకుండా చేశారన్న కోపం ఉన్నా, ఎవరూ రోడ్డెక్కలేదు. ఎన్నికల తరువాత అడపా దడపా పలువురు ఎంపీలు పార్లమెంటులో ఈ అంశం లేవనెత్తినప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యకలాపాలు మాత్రం పెద్దగా చేపట్టలేదు.ఓఎస్‌డీ పంపిన నివేదికపై రైల్వే శాఖ స్పందించలేదు.

గతంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే జోన్ గురించి పార్లమెంటులో ప్రశ్నించగా డీపీఆర్ ఆమోదించాల్సి ఉందని దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని అప్పటి రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇంతలోనే వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగించాలంటూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ సంఘ్ తాజాగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇంతలోనే కేంద్రం షాకిచ్చింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని కొత్తగా రైల్వేజోన్ల ప్రతిపాదన లేదని బుధవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిస్తూ బా౦బ్ పేల్చారు.ఇదే మంత్రి వారం రోజుల క్రితం (డిసెంబరు 1న) పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కొత్త దక్షిణ కోస్తా జోన్‌కు 2020-21 బడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించామని.. ఈ జోన్‌కు తూర్ప కోస్తా రైల్వేలోని కొత్త రాయగడ డివిజన్‌తో కలిపి రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని చెప్పారు. 2019 ఆగస్టులోనే దీని డీపీఆర్‌ను సమర్పించారనీ తెలిపారు. వారం తిరిగేసరికి.. ఆ జోన్‌ ప్రస్తావనే లేకుండా సమాధానమివ్వడం కేంద్రం వైఖరిని తేటతెల్లం చేసింది. దీనికి ప్రధాన కారణం రైల్వేస్ను కార్పొరేట్ లకు కట్టబెట్టాలన్న ఉద్దేశమే అన్న వాదన వినిపిస్తోంది

కేంద్ర రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ ప్రకటనతో ఉత్తరాంధ్ర భగ్గుమంటోంది. రైల్వే జోన్ సాధన కోసం మళ్లీ ఉద్యమ బాటకు సిద్ధమవుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు మూడున్నర దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ ఈ హామీని పొందుపరిచారు. నూతన రైల్వే జోన్కు ఓఎస్డీగా నియమించి శ్రీనివాస్ ఆర్థిక, సాంకేతిక అంశాలన్నింటినీ పేర్కొంటూ జోన్‌ ఎలా ఏర్పాటు చేయాలో డీపీఆర్‌ను రెండేళ్ల క్రితమే రైల్వే బోర్డుకు పంపించారు. కానీ రైల్వే బోర్డు డీపీఆర్‌ను పక్కన పెట్టేసిందికేంద్ర మంత్రి ప్రకటనపై భగ్గుమన్న విశాఖ రైల్వేజోన్ సాధన సమితి రైల్వే జోన్ కోసం మళ్లీ తాము ఉద్యమబాట పడతామని అంటోంది. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖపట్నం రైల్వేస్టేషన్ వద్ద విశాఖ రైల్వేజోన్ సాధన సమితి ఆందోళన చేపట్టింది. ఈసారి ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేపడతామని విశాఖ రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్ సత్యనారాయణ మూర్తి తెలిపారు.

Also Read:  శీతాకాలంలో గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలు ఎన్నో..

Loading...
Unable to load recommendations.
Follow Us