రుతుపవనాలు ముఖం చాటేశాయా? తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..

చైనాలోని బావి తుఫాన్ ప్రభావంతో భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవన గాలులు దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లడంతో భారత్‌కు తేమగాలుల రాక తగ్గి, బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి ఎండల తీవ్రత పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదవగా, పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి..

రుతుపవనాలు ముఖం చాటేశాయా? తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
Temperatures Soar Across AP and Telangana

Updated on: Jul 13, 2026 | 10:40 AM

అమరావతి, జులై 13: చైనాలోని బావి తుఫాన్ ప్రభావం.. భారత రుతుపవనాలపై తీవ్ర ప్రభావంగా పడనుంది. రుతుపవన గాలులు దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లినట్లు వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు. భారత్ వైపు తేమగాలుల రాక తగ్గడంతో.. బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు ఆటంకం కలుగుతుంది. ఈ నెల 16 లేదా 17న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో ఏపీలో పలు జిల్లాలలో ఎండలు మళ్లీ మండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాతావరణం రెండో వేసవిని తలపిస్తున్నాయి. నిన్న తిరుపతిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాల్లో ఎండలతోపాటు వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

తెలంగణలోనూ ఇదే పరిస్థితి..

ఎల్‌ నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతుండడంతో మళ్లీ ఉక్కపోత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం ఖమ్మం సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో గరిష్ఠంగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, హనుమకొండ, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జులై 15 వరకు వాతావరణం ఈ విధంగానే ఉంటుందని తెలిపింది. జులై 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా ప్రస్తతం రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్‌, హిస్సార్‌, మీరట్‌, గోరఖ్‌పూర్‌ మీదుగా దక్షిణ అస్సాం వరకు కొనసాగుతుంది. దీంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉపరితల గాలులు 40 నుంచి 50 కి.మీ వేగంతో, తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Follow Us