AP News: రోడ్డు రోలర్ కాదది మృత్యుశకటం.. ఇద్దరి ప్రాణాలను రాక్షసిలా మింగేసింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన బత్తుల నరసింహారావు అనే వ్యక్తి రోడ్డు రోలర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తాటి చెట్ల పాలేనికి చెందిన రమణమ్మ అనే మహిళ కూలిగా పని చేస్తుంది. గత మూడు రోజులగా జాలరి పేట తో పాటు భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్‌లో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటువైపుగా వెళ్తున్నారు. జోడుగుల్లపాలెం నుంచి సాగర్ నగర్ వైపు బీచ్ రోడ్‌లో...

AP News: రోడ్డు రోలర్ కాదది మృత్యుశకటం.. ఇద్దరి ప్రాణాలను రాక్షసిలా మింగేసింది..
Representative Image

Edited By: Narender Vaitla

Updated on: Dec 30, 2023 | 12:22 PM

అది రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించే రోడ్డు రోలర్ వాహనం. ఆ వాహనానికి పని కలిగితే.. దాని నుంచి కనీసం పదుల సంఖ్యలో కూలీలకు జీవన భృతి. దాన్ని నమ్ముకుని డ్రైవర్, కొంతమంది రోడ్డు పని కూలీలు బతుకుతూ ఉంటారు. నిత్యం దాంతోనే ఆ డ్రైవర్ కు సావాసం. కానీ.. అన్నం పెడుతున్న ఆ వాహనమే.. ఆయువు తీసింది. రెండు పేద జీవితాలను… చెదిమేసింది. విశాఖ జూ పార్కు బీచ్ రోడ్‌లో రోడ్డు రోలర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రెండు కుటుంబాల్లో విషాధాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన బత్తుల నరసింహారావు అనే వ్యక్తి రోడ్డు రోలర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తాటి చెట్ల పాలేనికి చెందిన రమణమ్మ అనే మహిళ కూలిగా పని చేస్తుంది. గత మూడు రోజులగా జాలరి పేటతో పాటు భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్‌లో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటువైపుగా వెళ్తున్నారు. జోడుగుల్లపాలెం నుంచి సాగర్ నగర్ వైపు బీచ్ రోడ్‌లో వెళ్తుండగా.. జూ పార్కు గేటు దగ్గరకు వచ్చేసరికి, రోడ్డు భారీగా పల్లంగా ఉంది.

దీంతో ఏమైందో ఏమో కానీ రోడ్డు రోలర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. బ్రేకులు కూడా సరిగా పడకపోవడంతో.. కంగారుపడిన డ్రైవర్ నర్సింగ్ రావు వెంటనే రోలర్‌పై తనతో ఉన్న మహిళను దూకేయాలని సూచించాడు. దీంతో భయంతో ఒక్కసారిగా దూకేసిన ఆమె రోలర్‌ కింద పడడంతో కాళ్లు నలిగిపోయాయి. మరోవైపు రోడ్డు రోలర్‌ను అదుపు చేసేందుకు డ్రైవర్ నర్సింగ్ రావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డివైడర్ పైకెక్కి అవతలి రోడ్డు వైపు వెళ్లి అదుపుతప్పి బోల్తాపడింది.

దీంతో నర్సింగ రావుపై రోడ్‌ రోలర్‌ ఎక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే రగంలోకి దిగిన ట్రాఫిక్‌ ఏ డీసీపీ శ్రీనివాస రావు, సీఐ ప్రసాద్‌ రావు గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనంతంర అధికారులు క్రేన్ సాయంతో బోల్తా పడిన రోలర్‌ను పైకి లేపి అక్కడ నుంచి తరలించారు. జూ పార్కుకు అతి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు.

ఒకవేళ జూ గేటు ఎదురుగా ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత మరింత పెరిగేదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. రోడ్డు రోలర్‌ను నమ్ముకొని, జీవనం సాగిస్తున్న పేదల జీవితాలను అదే రోడ్డు రోలర్‌ ఛిన్నాభిన్నం చేయడం ఆ కూలీల జీవితాల్లో విషాధాన్ని నింపింది.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..