గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శలపాడుకు చెందిన త్రిలోకేశ్వరి తెనాలి ఏఎస్ఎన్ కాలేజ్ లో బికామ్ కంప్యూటర్స్ చదువుతుంది. మొదటి నుండి ఈమెకు చిత్రకళపై ఆసక్తి ఉంది. అయితే అందరిలా చిత్రాలు వేయడం కంటే భిన్నంగా ఆలోచించింది. విభిన్న చిత్రాలను రూపొందించడానికి ఉన్న అవకాశాలను ఇంటర్నెట్ ద్వారా వెతికి పట్టుకుంది. వీటిల్లో ఆమెకు క్యూరింగ్ ఆర్ట్ పై మక్కువ ఏర్పడింది.
సాధారణ చిత్రాన్ని ఎంపిక చేసుకొని దానిపై కాగితాలను చిన్న చిన్న దారాల్లా మార్చి ఆ చిత్రంపై ఆ కాగితపు దారాలును అంటిస్తారు. వివిధ రంగులున్న కాగితాలు ఆ చిత్రాలను చూడచక్కగా చేస్తాయి. అయితే మామూలు చిత్రల్లా కాకుండా రంగులపై ప్రత్యేక ఆసక్తి ఉండటంతో పాటు కాగితాలను చిన్న చిన్న దారాల్లా చేసి వాటిని సాధారణ చిత్రంపై అంటించడానికి చాలా ఓపిక, శ్రద్ద అవసరం..
త్రిలోకేశ్వరి తనిని తాను నిరూపించుకునేందుకు అనేక చిత్రాలను క్యూరింగ్ ఆర్ట్ లోకి మార్చి వాటిని స్నేహితులకు, బంధువులకు బహుమతులుగా అందిస్తున్నారు. వాటిని అందుకున్న వారు ఇచ్చే ప్రశంసలే తనకు బోలేడంత ఆనందాన్ని ఇస్తున్నాయని త్రిలోకేశ్వరి చెబుతున్నారు.
అంతేకాకుండా యోగాలోనూ ఆమె శిక్షణ పొంది కేంద్ర ఆయుష్ విభాగం నుండి యోగా టీచర్ సర్టిఫికేట్ ను అందుకున్నారు. యోగాను ఇతరులకు నేర్పుతున్నారు. భవిష్యత్తులో విభిన్న కళలను మరింత మందికి చేరువ చేసేలా కళా సంస్థను ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని త్రిలోకేశ్వరి చెబుతున్నారు.
ఆమె క్యూరింగ్ ఆర్ట్ లోకి మార్చిన అనేక చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దేవుళ్ల ఫోటోలతో పాటు సమాజంలో స్పూర్తిని రేకెత్తించిన మదర్ ధెరిస్సా ఇంకా అనేక మంది చిత్రాలను ఆమె రూపొందించారు.