
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చింతల అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్య, వారి మూడేళ్ల కుమార్తె రితిక్ష, ఏడాదిన్నర చిన్నారి హన్విక ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రవీణ్ కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భార్య అహల్య, ఇద్దరు పసిబిడ్డలకు బలవంతంగా విషం ఇచ్చి ప్రాణాలు తీసిన అనంతరం, ప్రవీణ్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభంశుభం తెలియని పసికందులు కూడా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చనిపోయే ముందు ప్రవీణ్ కుమార్ తన మొబైల్లో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో పాటు కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపించాడు. ఆ సందేశం చూసి తీవ్ర ఆందోళనతో బంధువులు హుటాహుటిన ఇంటికి చేరుకునేసరికి నలుగురూ ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు. వెంటనే స్థానికులు, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పెందుర్తి పోలీసులు, ఏసీపీ ప్రదీప్తి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
“తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మాకు సమాచారం అందింది. అంతకుముందే వారు చనిపోతున్నట్లు వాట్సాప్ స్టేటస్ పెట్టారు. కుటుంబ సభ్యులు వచ్చేలోపే నలుగురూ చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నాం” అని ఏసీపీ ప్రదీప్తి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.